చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యపై జగన్ సంచలనం, 'ఎదురు తిరిగిన' వ్యాఖ్యలు, రెచ్చిన టీడీపీ
తన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు లేదా జిల్లాలకు వెళ్లినప్పుడు స్థానిక సమస్యలను లేవనెత్తుతున్
కర్నూలు: తన ప్రజా సంకల్ప యాత్రలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయా నియోజకవర్గాలకు లేదా జిల్లాలకు వెళ్లినప్పుడు స్థానిక సమస్యలను లేవనెత్తుతున్నారు.
రాజీనామా చేసే పరిస్థితి రాజకీయాల్లో రావాలి
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాయకులు పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రాజకీయాల్లో రావాలని జగన్ పేర్కొన్నారు. గురువారం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు చెప్పని అబద్ధం లేదన్నారు. ఆయనను గద్దె దింపితేనే అభివృద్ధి జరుగుతుందన్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య
వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 22 లక్షల ఎకరాల భూపంపిణీ చేపడితే, టీడీపీ వచ్చాక భూపంపిణీ జరగకపోగా, నిరుపేదల భూములను లాక్కుంటున్నారని జగన్ మండిపడ్డారు. టీడీపీ అన్యాయాన్ని ప్రశ్నించినందుకు చెరుకులపాడు నారాయణరెడ్డిని పట్టపగలే హత్య చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రశ్నిస్తే చంపించే పాలనగా తెలుగుదేశం పార్టీ మారిందని జగన్ మండిపడ్డారు.
బాబును దించితేనే మంచి రోజులు
వైయస్ హయాంలో ఏ ఛార్జీలు పెంచకుండా సంక్షేమ పాలన సాగించారని జగన్ అన్నారు. చంద్రబాబును కుర్చీలో నుంచి దించితేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని చెప్పారు. ఎలాంటి పాలన కావాలనేది ప్రజలే నిర్ణయించాలని ఆయన పిలుపునిచ్చారు.
పొలంలో రాత్రికి బస
కాగా, వైయస్ జగన్ శుక్రవారం పాదయాత్రకు విరామం తీసుకున్నారు. ఆయన హైదరాబాదులో కోర్టుకు హాజరయ్యారు. అనంతరం కర్నూలు జిల్లా వెల్దుర్తికి చేరుకున్నారు. శుక్రవారం హైవే పక్కన పొలంలో రాత్రి జగన్ బస చేయనున్నారు.
ఎదురు తిరిగిన జగన్ వ్యాఖ్యలు
ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేని నాయకులు పదవులకు రాజీనామా చేసే పరిస్థితి రాజకీయాల్లో రావాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రజల డబ్బును దోచుకున్న జగన్ తొలుత తప్పుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బాబును విమర్శించే అర్హత లేదన్నారు.
జగన్పై రెచ్చిన టీడీపీ నేతలు
డొల్ల కంపెనీలు సృష్టించిన 12 మంది పేర్లను ఈడీ పొందుపర్చింది. ఇందులో జగన్ పేరు ఉంది. దీంతో టీడీపీ నేతలు జగన్ పైన రెచ్చిపోయారు. ఏపీకీ జగన్ కళంకంగా మారారని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ కరెప్షన్లో జగన్ నెంబర్ వన్ అన్నారు. పారడైజ్ పేపర్లలో జగన్ పేరు వచ్చిందని, దీనిపై పాదయాత్రలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. 2019 ఎన్నికల్లోగా కేసుల నుంచి శిక్ష పడకుండా తప్పించుకోవాలన్నదే జగన్ వ్యూహం అన్నారు. జగన్ తదుపరి జీవితం జైల్లోనే అన్నారు.
ప్రజలు తిరస్కరించే ముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలి
చంద్రబాబు కృషి వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్ 1గా నిలిస్తే జగన్ ఈడీ ర్యాంకింగ్స్ కోసం పోటీ పడుతున్నారని, ఆయన 10వ స్థానంలో నిలిచారని బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. జగన్కు పులివెందులలో పోటీ చేసే అర్హత లేదని, ప్రజలు తిరస్కరించకముందే జగన్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని హితవు పలికారు. ఆయనకు ప్రజాసేవ చేతకాదన్నారు.
జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రథమ స్థానంలో తీసుకెళ్తుంటే, జగన్ అవినీతి వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఈడీ లిస్టులో డొల్ల కంపెనీల వ్యవహారంపై జగన్ తన పాదయాత్రలో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీబీఐ కేసుల్లో ఇరుకున్న జగన్ అధికారం కోసం అమలుకాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాజన్న పాలన తీసుకొస్తానని చెబుతున్న జగన్ మరోసారి లక్ష కోట్ల రూపాయల అవినీతికి పాల్పడతారా? అని ప్రశ్నించారు.
వాటి నుంచి బయటపడేందుకే పార్టీ పెట్టారా
ఆర్థిక నేరాలకు చిరునామాగా ఉన్న జగన్ వీటినుంచి బయటపడేందుకే రాజకీయ పార్టీని పెట్టారా? అనే అనుమానం కలుగుతోందని మంత్రి కళావెంకట్రావు అన్నారు. ఈడీ బయటపెట్టిన 12 మనీల్యాండరింగ్ కేసుల్లో జగన్ది పదో పేరుగా ఉందన్నారు. దేశంలో, ప్రపంచంలో వెలుగులోకి వస్తున్న ఆర్థిక నేరాల్లో ఆయన పేరు ఉండటం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు.