జగన్పై హత్యాయత్నం, సిట్ నివేదికను సీల్డ్ కవర్లో అడిగిన హైకోర్టు: లాయర్ ఏం చెప్పారంటే?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా వేసంది. తనపై జరిగిన హత్యాయత్నంపై జగన్ ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. కేసులో వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.
అన్నయ్య, నేను ఏం పీకుతారన్నారు, ఎవరు ఎవరితోనో ఉన్నారనేది న్యూసా?: పవన్ కళ్యాణ్
ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) విచారణ పురోగతి నివేదికను సీల్డు కవర్లో మంగళవారం నాడు కోర్టుకు సమర్పించాలని అటార్నీ జనరల్కు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. జగన్ తరఫున ప్రముఖ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి అంతకుముందు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ తీరు, పోలీసుల విచారణ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
కత్తి మెడకు తగిలి ఉంటే ప్రాణాలు పోయేవి
ప్రభుత్వం తీరు, పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉందని జగన్ తరఫు న్యాయవాది అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే కిందిస్థాయి ఉద్యోగుల చేతి విచారణ చేయిస్తున్నారన్నారు. కత్తి మెడపై తగిలి ఉంటే జగన్ ప్రాణాలే పోయి ఉండేవని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పైన హత్యాయత్నంలో కుట్ర దాగి ఉందని, ఏపీ ప్రభుత్వం, పోలీసుల అజమాయిషీలేని, విచారణ సంస్థల చేత దర్యాఫ్తు జరిపించాలని కోర్టును కోరారు. హత్యాయత్నాన్ని తప్పుదోవ పట్టించేలా చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ వ్యవహరించారన్నారు.
స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ
గురువారం కూడా జగన్ హత్యాయత్నం కేసుపై వాదనలు జరిగాయి. జగన్ పైన హత్యాయత్నం జరిగిన గంటలోనే నిందితుడి ప్రచారం కోసమే ఇలా చేశారని డీజీపీ మీడియా సమక్షంలో తేల్చేశారని, సీఎం కూడా ఈ ఘటనను చాలా తక్కువ చేసి మాట్లాడారని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసుల దర్యాఫ్తు నిష్పక్షపాతంగా జరిగే అవకాశం లేదని, కాబట్టి స్వతంత్ర దర్యాఫ్తు సంస్థతో విచారణ జరగాలన్నారు. జగన్ పైన దాడి వెనుక భారీ కుట్ర ఉందన్నారు.
వైవీ సుబ్బారెడ్డి తరఫు లాయర్
వైవీ సుబ్బారెడ్డి తరఫు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ తరఫున తామూ పిటిషన్ దాఖలు చేశామని చెప్పారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పిటిషనర్ బాధితుడు అయితే ఈ వ్యాజ్యం తమ ముందుకు ఎలా వచ్చిందని ప్రశ్నించింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు దీనిని పిల్తో జత చేశారని, వాస్తవానికి ఆ పిల్కు, తమ వ్యాజ్యానికి సంబంధం లేదని జగన్ తరఫు లాయర్ మోహన్ రెడ్డి చెప్పారు. అడ్వోకేట్ జనరల్ చెప్పిన వివరాల మేరకు తమ వ్యాజ్యాన్ని ఈ పిల్కు జత చేశామన్నారు. దీనిపై కోర్టు విస్మయం వ్యక్తం చేసింది.
శ్రీనివాస్ రిమాండ్ పొడిగింపు
ఇదిలా ఉండగా, జగన్ పైన కత్తితో దాడి చేసిన శ్రీనివాస రావు రిమాండును విశాఖ మూడో మెట్రోపాలిటన్ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 23వ తేదీకి రిమాండ్ పొడిగిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. అతని రిమాండ్ శుక్రవారంతో ముగిసినందున పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం అతనిని జైలుకు తరలించారు.