టీడీపీలో కార్యకర్తలు నలిగిపోయారు.. ఇప్పటికీ మా ఇంట్లో వైఎస్ ఫోటో: శిల్పామోహన్
తాను అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం లేదని, పవర్ పాలిటిక్స్ కు తాను చాలా దూరంగా ఉన్నానని శిల్పా మోహన్ రెడ్డి తెలియజేశారు.
కర్నూలు: నంద్యాల ఉపఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డి ఇచ్చిన ట్విస్టు.. ఏ పార్టీకి మేలు చేకూరుస్తుందో అంచనా వేయడం కష్టంగానే మారింది. ఓ పక్క రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. శిల్పాకు వైసీపీ టికెట్ దక్కడం కూడా అనుమానమే అని చెప్పాలి.
మరోవైపు శిల్పామోహన్ రెడ్డి మాత్రం జగన్ తనకే టికెట్ ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. తాజాగా జగన్ మీడియాతో మాట్లాడిన శిల్పామోహన్.. టీడీపీలో విభేదాలపై స్పందించారు. అదే సమయంలో వైసీపీ సిద్దాంతాలు, జగన్ పనితీరు నచ్చడం వల్లే ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.
ఇది క్లియర్: శిల్పాకు రాజగోపాల్ ట్విస్ట్.. జగన్ తనకే 'టికెట్' ఇస్తారన్న ధీమా!
టీడీపీలో ఉండటం వల్ల కార్యకర్తలు నలిగిపోయారని, నంద్యాల టీడీపీలో మూడు గ్రూపులు ఉన్నాయని చెప్పారు. తమ కార్యకర్తల పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. కార్యకర్తల ఒత్తిడి మేరకే తాను టీడీపీని వీడినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు రాజకీయ గురువు అని, తాను టీడీపీలోకి వెళ్లినా.. ఆయన ఫోటో తమ ఇంట్లో ఇప్పటికీ ఉందన్నారు.
గ్రూపు రాజకీయాల్లో నిరంతరం ఘర్షణ వాతావారణాన్ని ఎదుర్కోవడం మంచిది కాదని కార్యకర్తలు తనకు సూచించినట్లుగా శిల్పామోహన్ రెడ్డి చెప్పారు. వాళ్ల కోరిక మేరకే వైసీపీలో చేరడానికి సిద్దమవుతున్నానని అన్నారు. భూమా నాగిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాకే.. విభేదాలు మరింత పెరిగాయన్నారు. భూమా ప్రాతినిధ్యంలో అసలు నియోజకవర్గంలో అభివృద్ధే జరగలేదని ఆరోపించారు.
తాను అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్లడం లేదని, పవర్ పాలిటిక్స్ కు తాను చాలా దూరంగా ఉన్నానని శిల్పా మోహన్ రెడ్డి తెలియజేశారు. పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. పార్టీ మారినవారు గెలిచే పరిస్థితి కూడా కనిపించడం లేదన్నారు. ఇది కేవలం రాజ్యాంగ ఉల్లంఘన మాత్రమే కాదని, ప్రజల వ్యతిరేకతను కూడా చవిచూడాల్సి ఉంటుందని పేర్కొన్నారు.