చంద్రబాబుగారూ! సామాన్యురాలిగా అడుగుతున్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? : వైఎస్ షర్మిళ
అమరావతి: రాష్ట్ర విభజన చోటుచేసుకున్న ఈ సమయం అత్యంత కీలకమైన ఎన్నికలని వైఎస్ షర్మిళ అన్నారు. రాష్ట్రంలో భూతద్దం పెట్టుకుని వెదికినా అభివృద్ధి కనిపించట్లేదని అన్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చాయా? రైతు బాగుపడుతున్నాడా? పేద వాడు సంతోషంగా ఉన్నాడా? పేద విద్యార్థికి భరోసా ఉందా? అని ఆమె ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి హాయంలో కళకళలాడిన రాష్ట్రమని అన్నారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పేద కుటుంబం, రైతు కుటుంబం ధైర్యంగా ఉండేదని అన్నారు. పేద విద్యార్థి ఉచితంగా చదువుకునే భరోసా ఉండేదని అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని అందించారని చెప్పారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రతి వర్గానికి వైఎస్ మేలు చేశారని షర్మిళ చెప్పారు.
సోమవారం ఉదయం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత షర్మిళ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ నెల 29వ తేదీ నుంచి ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో.. ఆమె పలు అంశాలపై చంద్రబాబు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ప్రత్యేకించి- 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు, పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఆధారంగా చేసుకుని చంద్రబాబుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
మోడీపై ఒవైసీ ఘాటు విమర్శలు, టోపీ, విజిల్ ఇస్తానంటూ సటైర్
పాతికేళ్లు వెనక్కి వెళ్లిన రాష్ట్రం..
చంద్రబాబు హయాంలో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి నెట్టారని అన్నారు. మొదటి అయిదు సంతకాలు అని పెట్టి, కనీసం మొదటి సంతకానికైనా విలువ ఇచ్చారా? రైతులకు మొత్తం రణ మాఫీ అని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. రైతు రుణ మాఫీపై సంతకం పెట్టకుండా.. కోటయ్య కమిటీ నియామకంపై సంతకం చేశారని అన్నారు. కోటయ్య కమిటీ 87 వేల కోట్ల రూపాయల రుణ బకాయిలను 24 వేల కోట్లకు పరిమితం చేసిందని చెప్పారు. అబద్ధపు హామీలు ఇవ్వడం చంద్రబాబు అధికార దాహం కాదా? డ్వాక్రా రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారా? లేదా? అధికారంలోకి వచ్చిన తరువాత ఆ శాఖను చూస్తోన్న పరిటాల సునీత.. స్వయంగా అసెంబ్లీలో పూర్తి రుణాన్ని మాఫీ చేయలేమని చెప్పడం వాస్తవమా? కాదా? అని నిలదీశారు.
మాఫీ చేస్తామన్న డ్వాక్రా రుణాలను పసుపు-కుంకుమగా ఇస్తున్నారా? లేదా?
డ్వాక్రా రుణ మొత్తం 14 వేల కోట్ల రూపాయలు కాగా, ఇప్పటికి అది 25 వేల కోట్లకు చేరిందని అన్నారు. ఈ అయిదేళ్లలో కేవలం 6000 కోట్లతో బిక్షం ఇచ్చినట్టు వేస్తున్నారని అన్నారు. పసుపు కుంకుమ పేరుపెట్టి, మహిళలను మభ్య పెట్టే ప్రయత్నం కాదా? మహిళలను వంచన చేయటం కాదా? 14 వేల కోట్ల ప్రాజెక్ట్ ను 60 వేల కోట్లకు పోలవరం అంచనా వ్యయాన్ని పెంచారు. కమిషన్ల కోసం కక్కుర్తి పడి కేంద్రం నుంచి లాక్కోలేదా? అది దురాశ కాదా? పోలవరం మూడేళ్లలో పూర్తి చేస్తాననేది చంద్రబాబు వాగ్దానం కాదా? చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే, మాట మీద నిలబడే నైజమే ఉంటే పోలవరం పూర్తయ్యేది కాదా? అమరావతిలో నాలుగు వేల ఎకరాలు. కేవలం 50 లక్షల రూపాయలకు తన బినామీలకు ప్రభుత్వం తరఫున అమ్మేసి, ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టలేదా? ఇది అన్యాయం కాదా? అని షర్మిళ ప్రశ్నించారు.
అమరావతిలో శాశ్వత భవనం ఏదీ?
రాజమౌళి దర్శకత్వంలో గ్రాఫిక్స్ చూపించారని, మన నిపుణుల చేత కాదని సింగపూర్ నుంచి ప్లానర్స్ ను రప్పించారని షర్మిళ ఎద్దేవా చేశారు. త్రీడీ మోడల్ ను చూపించారని విమర్శించారు. అమరావతిలో ఒక్క శాశ్వత భవనమైనా కట్టారా? అమరావతిని అనాధను చేస్తూ, ఒక్క శాశ్వత భవనం కూడా కట్టకుండా.. హైదరాబాద్ లో వందల కోట్ల రూపాయలతో శాశ్వత భవనం కట్టుకోలేదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? అని షర్మిళ ప్రశ్నించారు.
ఫీజు రీఎంబర్స్ మెంట్ చేయకపోవడం మోసం కాదా?
పేద విద్యార్థుల కోసం రాజశేఖర్ రెడ్డి పూర్తిగా ఫీజు రీ ఎంబర్స్ మెంట్ చేస్తే.. చంద్రబాబు అది కూడా ఇవ్వలేదని అన్నారు. తల్లిదండ్రులు అప్పులపాలు అవుతున్నారని విద్యార్థులు చదువులు మానేశారని చెప్పారు. చంద్రబాబు తన చేతులతో ఆ విద్యార్థుల భవిష్యత్తును ఖూనీ చేసినట్టు కాదా? పేదవాడు కూడా గొప్పవాడిలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోవాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీని ప్రవేశపెడితే.. చంద్రబాబు ఆ లిస్ట్ నుంచి ఎన్నోకార్పొరేట్ ఆసుపత్రుల పేర్లను తొలగించి, పేదవాడు మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లాలని శాసించలేదా? ఇది అమానుషం కాదా? చంద్రబాబుకో, ఆయన కుటుంబానికో జబ్బు వస్తే, కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్తారని అన్నారు. పేదవాడు మాత్రం జబ్బు పడితే ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్లేలా శాసించారని, ఇది దుర్మార్గం కాదా? అని షర్మిళ నిలదీశారు. పేదవాడికి సరైన, నాణ్యమైన వైద్యం అందక చనిపోతే.. ఆ పాపం చంద్రబాబుది కాదా? అని ప్రశ్నించారు.
జాబు ఎవరికొచ్చింది? లోకేష్ కు కాదా?
బాబొస్తే, జాబొస్తుందని అన్నారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ కు ఏకంగా మూడు మంత్రి శాఖలను ఇచ్చారని అన్నారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తికి మూడు మంత్రి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. అ, ఆలు రావు గానీ అగ్రతాంబూలం నాకే అన్నట్టు వ్యవహరించారు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అనుభవం ఉందని మూడు శాఖలు ఇచ్చారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? అని ప్రశ్నించారు. మామూలు ప్రజలకు ఉద్యోగాలు గానీ, ఉద్యోగాల నోటిఫికేషన్లు గానీ లేవని షర్మిళ అన్నారు. తెలంగాణలో కేటీఆర్ కు ఐటీ శాఖ ఇచ్చారని తన లోకేష్ కు అదే శాఖ ఇచ్చుకున్నారని చెప్పారు. హైదరాబాద్ తరహాలో అమరావతికి సాఫ్ట్ వేర్ కంపెనీలు వచ్చాయా? అని నిలదీశారు. మైక్రోసాఫ్ట్ వస్తుందని ఊదరగొట్టారని, తమకు ఆ ఉద్దేశమే లేదని ఆ సంస్థ ప్రకటించిందని గుర్తు చేశారు.
డేటా చోరీ దొంగెవరో చంద్రబాబుకు తెలియదా?
ప్రజల సమాచారాన్ని లోకేష్ దొంగతనం చేసి, తనక్కావాల్సిన ప్రైవేటు కంపెనీలకు ఇచ్చుకున్నారని విమర్శించారు. దీనికి కారణం ఎవరో చంద్రబాబుకు తెలియదా? డేటా దొంగలను శిక్షించక పోగా.. వారికి ఆశ్రయం ఇస్తున్నామని చంద్రబాబు ప్రకటించుకోవడం ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి సిగ్గుగా అనిపించట్లేదా? బాబు-మోడీ జోడీ కలిసి ప్రత్యేక హోదాను ఎగ్గొట్టేశారని అన్నారు.
రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసింది..
హోదా ఇస్తామని చెప్పి, బీజేపీ మన చెవిలో పూలు పెట్టిందని, ద్రోహం చేసిందని అన్నారు. దీనికి కారణం చంద్రబాబు తమను ప్రశ్నించరనే నమ్మకం కాదా? అని షర్మిళ విమర్శించారు. హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అని చంద్రబాబు తీర్మానం చేయలేదా? హోదా కోసం పోరాడుతున్న వాళ్లను జైల్లో పెట్టిస్తామని చంద్రబాబు బెదిరించలేదా? హోదా వచ్చిన రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని చంద్రబాబు హేళన చేయలేదా? ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విశాఖకు వెళ్తే.. ఆయనను ఎయిర్ పోర్ట్ లోనే నిర్బంధించలేదా? నిరసనగా ఆయన రన్ వే మీదే బైఠాయించలేదా? వైఎస్ఆర్ సీపీ నాయకులు హోదా పోరాటంలో భాగంగా అసెంబ్లీని ముట్టడిస్తే.. వారిని అరెస్టు చేయించలేదా? ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయలేదా? రాష్ట్రానికి కీలకమైన హోదా అంశాన్ని నిరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోరా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నానని షర్మిళ అన్నారు.
మహాలక్ష్మీ పథకం అమల్లో ఉందా?
రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పథకం కింద 25 వేల రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే వేస్తామన్నారు.. ఇచ్చేశారా?, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అన్నారు.. కాలేజీ విద్యార్థులకు ఐప్యాడ్లు ఇచ్చేశారా? ఇంటికొక ఉద్యోగం, లేకపోతే 2000 రూపాయల భృతి అన్నారు? ఈ లెక్కన ఈ అయిదేళ్లలో చంద్రబాబు ప్రతి ఇంటికీ లక్షా 25 వేల రూపాయలు బాకీ పడ్డారని, ఆ మొత్తం ఇచ్చేశారా? అని షర్మిళ నిలదీశారు. ప్రతి పేదవాడికీ మూడు సెంట్ల భూమి, పక్కా ఇళ్లు కట్టిస్తామని అన్నారని, వాటిని కట్టించారా? అని ప్రశ్నించారు. చేనేతలకు, మరమగ్గాలకు పూర్తి రుణమాఫీ చేసేశారా? రెండు రూపాయలకే 25 లీటర్ల మినరల్ వాటర్ ఇస్తున్నారా? ఏపీని అప్పులాంధ్రప్రదేశ్ గా మార్చటం, జన్మభూమి కమిటీలు, లంచగొండితనం, దౌర్జన్యం ప్రోత్సహించారని అన్నారు. సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే.. అది వాస్తవం అవుతుందా? అని ఆమె చంద్రబాబుపై ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.