ఈయన యాక్టర్.. ఆయన డైరెక్టర్: దర్శకుడు చెప్పిందే చేస్తున్నారు: పవన్ పై ఘాటు విమర్శలు
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిళ..జనసేన పార్టీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ ఓ సినిమా నటుడని, దర్శకుడు ఏది చెబితే, నటులు అదే చేస్తుంటారని ఎద్దేవా చేశారు. సోమవారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆమె.. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డితో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నకు షర్మిళ సమాధానాలు ఇచ్చారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మధ్య లోపాయకారి ఒప్పందాలు ఉన్నాయని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జనసేనకు వేసినట్టేనని, జనసేనకు ఓటు వేస్తే, టీడీపీకి వేసినట్టేనని చెప్పారు.
చంద్రబాబుగారూ! సామాన్యురాలిగా అడుగుతున్నా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? : వైఎస్ షర్మిళ
డైరెక్టర్ చెప్పిందే యాక్టర్ చేస్తున్నారు..
`పవన్ కల్యాణ్ ఎవరు? నటుడు. ఒక యాక్టర్ ఏం చేయాలి? ఒక దర్శకుడు చెప్పింది చేయాలి? పవన్ కల్యాణ్ రాజకీయ సినిమాలో చంద్రబాబు డైరెక్టర్. పవన్ కల్యాణ్ యాక్టర్. పవన్ కల్యాణ్.. చంద్రబాబు చెప్పింది చేస్తున్నారు. నటుడిగా దర్శకుడు ఏది చెబితే అదే చేస్తున్నారు..` అని ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల కిందటే తనకు ఆ విషయం అర్థమైందని అన్నారు. కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన విషయం డేటా చోరీ ఘటనలో పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించలేదని అన్నారు.
వివేకా హత్యపై థర్డ్ పార్టీ విచారణ కోసం ప్రశ్నించారా?
తనకు తెలిసి పవన్ కల్యాణ్ ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదని షర్మిళ చెప్పారు. డేటా చోరీ విషయంపై పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడలేదని ఆమె ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పచ్చ పార్టీ క్యాడర్ ఉంటుందని విమర్శించారు. బయటికేమో పొత్తు లేదు, పొత్తు లేదు అని చెప్పుకొంటూనే లోలోపల సీట్ల సర్దుబాటుచేసుకుంటున్నారని ఆరోపించారు. తన పినతండ్రి వివేకానంద రెడ్డి హత్యోదంతంపై తాము థర్డ్ పార్టీ విచారణ అడుగుతున్నామని, ఈ విషయంలో కూడా పవన్ కల్యాణ్ ఎక్కడా స్పందించలేదని అన్నారు. చంద్రబాబుతో పొత్తు అంటూ లేకపోతే.. వివేకా హత్యపై థర్డ్ పార్టీ విచారణ కోసం పవన్ కల్యాణ్ ఎందుకు అడగట్లేదని అన్నారు. భయమెందుకని నిలదీశారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జనసేనకు వేసినట్టేనని, జనసేనకు ఓటు వేస్తే, టీడీపీకి వేసినట్టేనని చెప్పారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని చెప్పారు. అయిదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీని, ముఖ్యమంత్రిని విమర్శించకుండా, ప్రతిపక్ష పార్టీని ఆరోపణలు చేయడం దేనికి సంకేతాలని ప్రశ్నించారు.
పప్పుగారు లేకపోతే ఎంటర్టైన్ మెంట్ మిస్ అవుతాం:
ఈ నెల 29వ తేదీ నుంచి తాను మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు షర్మిళ చెప్పారు. మంగళగిరి నుంచే ఎందుకంటూ విలేకరులు ప్రశ్నించగా.. చంద్రబాబు కుమారుడు, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న మంత్రి లోకేష్ ను ఉద్దేశించి `అక్కడ పప్పుగారు ఉన్నారు కదా? అందుకని..` అంటూ చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. పోలింగ్ ఏ రోజున ఉందో కూడా లోకేష్ కు తెలియదని అన్నారు. షెడ్యూల్ ప్రకారం.. వచ్చేనెల 11వ తేదీన పోలింగ్ ఉండగా 9వ తేదీన పోలింగ్ ఉందని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలంటూ లోకేష్ ఇటీవలే ఎన్నికల ప్రచారంలో చెప్పిన ఉదంతాన్ని షర్మిళ ఈ సందర్భంగా గుర్తు చేశారు. లోకేష్ లేకపోతే రాజకీయాల్లో ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవుతామని చెప్పారు.