షర్మిలను దించుతున్నారు?: వచ్చే ఎన్నికల్లో ఎంపీగా బరిలోకి.. జగన్ నిర్ణయమే?
విషయాన్ని ఇలాగే వదిలిపెడితే.. ప్రత్యర్థులు తమ కంచుకోటకు ఎసరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ పార్టీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
విజయవాడ: చాలావరకు రాజకీయ పార్టీలన్ని ఏకవ్యక్తి కేంద్రంగా నడుచుకోవడం దేశంలోని చాలా రాజకీయ పార్టీల్లో కనిపించే సారూప్యత. పవర్ సెంటర్గా మరొకరికి అవకాశం ఇవ్వడానికి అధినేతలు అసలేమాత్రం ఒప్పుకోరు. పార్టీలో తనకు ప్రత్యామ్నాయంగా మరొకరు ఎదుగుతున్నారని తెలిసినా.. వారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు.
ఈ తరహా ధోరణి వైసీపీ అధినేత జగన్లో మరింత ఎక్కువగా కనిపిస్తుందన్న విమర్శ ఉంది. అందుకే సొంత చెల్లెలు షర్మిలను సైతం ఆయన పక్కనపెట్టారన్న వాదన ఉంది. ఒకానొక సమయంలో పార్టీని తన భుజాలపై నడిపించిన షర్మిల.. ఆ తర్వాత ఎప్పుడో గానీ పాలిటిక్స్ గురించి మాట్లాడటం లేదు. జగన్ నియంత్రణ వల్లే ఆమె క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారన్న ప్రచారం ఉంది.
ఈ నేపథ్యంలో షర్మిలకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెర పైకి వచ్చింది. 2019లో ఆమె ఎన్నికల బరిలో దిగబోతున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కడప నుంచి పోటీ:
కడప నియోజకవర్గం నుంచి షర్మిలను ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అక్కడి పార్టీ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి మెతక వైఖరి పార్టీ మైలేజీకి ప్రతికూలంగా మారిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విషయాన్ని ఇలాగే వదిలిపెడితే.. ప్రత్యర్థులు తమ కంచుకోటకు ఎసరు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆ పార్టీ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
జనంలోకి చొచ్చుకెళ్లడంలోను, అధికారులతో మాట్లాడే విషయంలోను ఆయన సున్నితంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అలా కాకుండా సందర్బానికి తగ్గట్లు దూకుడుగా వ్యవహరించే నేత ఉంటే కడప స్థానం పదిలంగా ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే షర్మిల పేరు తెర పైకి వచ్చినట్లు తెలుస్తోంది.
అవినాష్ రెడ్డికి నామినేటెడ్ పోస్ట్:
అవినాష్ రెడ్డికి నామినేటెడ్ పోస్టు కట్టబెట్టి షర్మిలను ఎంపీ చేయడమే పార్టీకి అన్నివిధాలా మేలు అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డితో పోల్చితే షర్మిల ఛరిష్మా ఉన్న నాయకురాలని, కాబట్టి ఆమే తమ ఎంపీగా ఉండాలని వారు కోరుతున్నట్లు చెబుతున్నారు. సిట్టింగ్ స్థానాన్ని లాక్కుంటే అవినాష్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది కూడా కీలకమే. అయితే తమ కుటుంబానికే చెందినవాడు కావడంతో.. తన మాటకు కట్టుబడి ఉంటాడని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
కడప కాకుండా.. మరికొన్ని పేర్లు:
వచ్చే ఎన్నికల్లో షర్మిల పోటీ చేస్తారో లేదో తెలియదు గానీ చాలానే ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. ఆమె తెలంగాణలోని ఖమ్మం నుంచి పోటీ చేయవచ్చనేది కొందరి వాదనైతే, మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయవచ్చనేది మరికొందరి వాదన. ఇవిగాక ఒంగోలు స్థానం కూడా ఈ జాబితాలో ప్రధానంగా వినిపిస్తోంది.
జగన్ నిర్ణయమే:
షర్మిల గనుక ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే.. పార్టీలో రెండో పవర్ సెంటర్ తయారవడం ఖాయం. పార్టీలో అంతా తన మాటకే కట్టుబడి ఉండాలనుకునే జగన్.. షర్మిలకు ఆ అవకాశం ఇస్తారా? అనేది అనుమానమే. అయితే అక్రమాస్తుల కేసు జగన్ను వెంటాడుతుండటంతో.. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎక్కడికైనా దారితీయవచ్చు.
కోర్టులు జగన్ పట్ల పూర్తి ప్రతికూలంగా వ్యవహరిస్తే.. మళ్లీ షర్మిలే క్రియాశీలక పాత్ర పోషించవచ్చు. ఆ కారణంతో జగనే షర్మిలను ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారనేది కూడా బలంగా వినిపిస్తోన్న వాదన.