అభ్యర్థులూ బహుపరాక్! మీ వస్తువులకు మీదే జవాబుదారి! ఎన్నికల ప్రచారంలో దొంగల హల్ చల్
గుంటూరు: ఎన్నికల ప్రచారంలో తలమునకలైపోతున్న వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులకు కొత్త చిక్కొచ్చి పడింది. జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. బహిరంగ సభలకు హాజరయ్యే ప్రజల జేబులు కాదు గానీ, ఏకంగా అభ్యర్థులు, పార్టీ నాయకులనే టార్గెట్ గా చేసుకుంటున్నారు. విలువైన వస్తువులను కొట్టేస్తున్నారు. ఎవరి వస్తువులకు వారే జవాబుదారి అని ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో రాసినట్టుగా తయారైంది నాయకుల పరిస్థితి.
సందట్లో సడేమియాలా దొంగలు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు చోరులు. ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిళ ఉంగరాన్నే కొట్టేశారు. దీనికోసం ఆ దొంగ పందెం కట్టి మరీ ఉంగరాన్ని చోరీ చేశాడని అంటున్నారు. గుంటూరు జిల్లాలోని తాడేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు మద్దతుగా షర్మిళ రెండురోజుల కిందటే బస్సు యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా ఆమె జిల్లాలోని తాడేపల్లిలో ఆమె బస్సు నుంచి స్థానికులకు అభివాదం చేస్తూ వెళ్లసాగారు. ఆ సమయంలో పలువురు పార్టీ అభిమానులు షర్మిళతో చేతులు కలపడానికి ప్రయత్నించారు. అదే అనువైన సమయంగా భావించిన గుర్తు తెలియని వ్యక్తి ఒకరు.. షర్మిళకు షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు నటించి, ఆమె చేతికి ఉన్న ఉంగరాలను చోరీ చేశాడు. ఉంగరాన్ని లాగుతున్న విషయం తెలిసిన వెంటనే షర్మిళ తన చేతిని వెనక్కి లాక్కున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఉంగరం చోరీకి గురైంది. మొబైల్లో ఇది రికార్డయింది. ఇప్పుడు ఈ వీడియో హల్చల్ చేస్తోంది. చుట్టూ పార్టీ అభిమానులు ఉన్న సమయంలో, ఎవర్ని అని ఏమీ ఉపయోగం ఉండదని ఆమె వాపోయారు. ఫలానా వ్యక్తి తన ఉంగరాన్ని చోరీ చేశాడని గుర్తించలేని పరిస్థితిని షర్మిళకు ఎదురైంది.