వైఎస్ షర్మిలకు సీఎం సీటు ఆఫర్ -వైసీపీ ఎంపీ సాయిరెడ్డికి వార్నింగ్ -తాజాగా మరో సంచలనం
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ఆరంభించిన వైఎస్ షర్మిల దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు. ప్రస్తుతానికి తెలంగాణకే పరిమితం అవుతానని చెప్పినప్పటికీ, రాబోయే రోజుల్లో ఏపీలోకి కూడా ఆమె పార్టీ ఎంటవుతుందని వినికిడి. గడిచిన రెండేళ్లలో సీఎం జగన్ అపాయింట్మెంట్కు సైతం నోచుకోలేని పలువురు వైసీపీ అసంతృప్త నేతలే షర్మిల రాకను స్వాగతిస్తున్నారని, షర్మిలకు ఒక దశలో ముఖ్యమంత్రి సీటు ఆఫర్ కూడా వచ్చిందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి..
తిరుమల శ్రీవారి సన్నిధిలో నిమ్మగడ్డ కుటుంబం -రేపే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?
తాజాగా మరికొన్ని సంచలనాలు..
తెలంగాణ వేదికగా వైఎస్ షర్మిల పెట్టబోతున్న విషయాన్ని, ఆ దిశగా ప్రయత్నాలు ఆరంభించే తేదీలు సహా ఇతర ముఖ్యమైన అంశాలను ముందుగానే, కచ్చితంగా రిపోర్టు చేసి, అన్నతో ఆమె గొడవలను సైతం ప్రచురించిన 'ఆంధ్రజ్యోతి' ఎండీ రాధకృష్ణ(ఆర్కే) తన తాజా వ్యాసంలో మరిన్ని సంచలనాలు రాసుకొచ్చారు. జగన్, షర్మిల మధ్య విభేదాలు ముదిరిన మాట వాస్తవమని, ఒక దశలో షర్మిలకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేశారని, ఎంపీ విజయసాయిరెడ్డికి సంబంధించిన కీలక రహస్యాలను బయటపెడతానని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి చర్చనీయాంశం అయిన ఆర్కే వ్యాఖ్యల ప్రకారం..
జగన్తో గొడవలు పూసగుచ్చినట్లు..
షర్మిల కొత్త పార్టీ విషంలోగానీ, జగన్ తో ఆమెకున్న గొడవల విషయంలోగానీ తప్పుడు రిపోర్టులు ఇస్తే పోయేది తమ పత్రిక పరువేనని, అసలు జగన్కు, షర్మిలకు మధ్య గొడవలు ఎందుకు వచ్చాయని తనను ప్రశ్నించకుండా వైసీపీ నేతలే సమాధానాలు వెతుక్కోవాలని ఆర్కే తాజా వ్యాసంలో రాశారు. సోదరుడితో విభేదించడానికి కారణం ఏమిటో షర్మిల తన బంధువులు, కుటుంబ శ్రేయోభిలాషులకు పూసగుచ్చినట్టు వివరించారని, ఈ విషయం తెలీనట్లుగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్లూ వాపోతున్నారని ఆర్కే అన్నారు. మరో కీలక మైన అంశంగా..
షర్మిలకు సీఎం పోస్టు..
వైఎస్ షర్మిలకు ఓ పార్టీ సీఎం సీటు ఆఫర్ చేసిందంటూ ఆర్కే చెప్పిన విషయంపైనా రాజకీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, ఇది వైసీపీ ఏర్పాటైన తర్వాతి ముచ్చట కాదని, జగన్ కాంగ్రెస్ నుంచి విడిపోతున్న సమయంలో.. అంటే, 2011లో చోటుచేసుకుందని ఆర్కే తెలిపారు. జగన్ కాంగ్రెస్ ను వీడుతోన్న సమయంలో కాంగ్రెస్లోనే కొనసాగితే గనుక సీఎం సీటు ఇస్తామంటూ వైఎస్ షర్మిలకు ఏకంగా సోనియా గాంధీ ఆఫర్ చేశారని ఆర్కే రాసుకొచ్చారు. అయితే అన్న కోసం అలాంటి ఆఫర్ ను కూడా షర్మిల వదులుకున్నారని, ఇప్పుడు మాత్రం తన త్యాగాలకు విలువ లేకపోవడాన్ని షర్మిల ప్రశ్నిస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు.
జైలు కాలంలో త్యాగాలను గుర్తుచేస్తూ..
ఇటీవల షర్మిలకు అన్నతో విబేధాలు పెరిగాయని.. రాష్ట్రంలో అక్కచెల్లెమ్మలకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని చెబుతున్న జగన్, సొంత చెల్లెల్ని ఇబ్బందులపాల్జేయడం, అవమానాలకు గురిచేయడమేమిటని ఆమె ప్రశ్నిస్తున్నారని షర్మిల అంటున్నట్లుగా 'ఆంధ్రజ్యోతి' ఎండీ రాసుకొచ్చారు. "మా అన్న నుంచి నన్ను దూరం చేయడం కోసం 2011లో సోనియాగాంధీ ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపితే ముఖ్యమంత్రి పదవి ఇస్తానని నాకు హామీ ఇచ్చినా తిరస్కరించా. ఈ విషయం జగన్తో పాటు మా అమ్మ విజయమ్మకు కూడా తెలుసు" అని షర్మిల తన బంధువుల వద్ద ప్రస్తావించినట్టు ఆర్కే చెబుతున్నారు. జగన్ జైలులో నాలుగు గోడలకే పరిమితం అయినప్పుడు, భారతీరెడ్డి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటుండగా, తన బిడ్డలకు దూరంగా ఎండనకా వాననకా పాదయాత్ర చేసిన తనకు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవమానం, నిర్లక్ష్యం, చులకనభావం, పక్షపాతమే మిగిలాయని షర్మిల మనస్తాపం చెందుతున్నారని ఆర్కే పేర్కొన్నారు. అంతేకాదు..
విజయసాయిరెడ్డి లీలలపై కలలు..
షర్మిలకు సంబంధించి అనేక విషయాలను ప్రస్తావించి ఆర్కే తన తాజా కాలమ్ లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సంచలన రీతిలో వార్నింగ్ కూడా ఇచ్చారు. జగన్ దగ్గర తన ప్రాభవం తగ్గకుండా ఉండడం కోసం విజయసాయిరెడ్డి ఈ మధ్యకాలంలో మీడియాపై నోరుపారేసుకుంటున్నారని, షర్మిలపై ఆంధ్రజ్యోతి కథనాలను 'ఆర్కే కలలు'గా సాయిరెడ్డి అభివర్ణించడాన్ని ఆయన తప్పుపట్టారు. ''షర్మిల పార్టీ విషయం విజయసాయిరెడ్డికి తెలియకపోవడానికి నేను బాధ్యుణ్ని కాను కదా! విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించినట్టే నేను కలగంటే కనిఉండవచ్చు. కానీ, ఆ కల వాస్తవమైంది కదా! విజయసాయిరెడ్డి లీలల గురించి కూడా నాకు కొన్ని కలలు వచ్చాయి. అవేమిటో త్వరలోనే అందరికీ తెలుస్తాయి. అవి తెలుసుకోవడానికి ఆయన కూడా సిద్ధంగా ఉంటే మంచిది'' అని ఆర్కే పేర్కొన్నారు. మొత్తంగా షర్మిల అంశంపై తన కథనాలు నిజం కావడంతో ఆర్కే మరింత లోతుల్లోకి వెళ్లి వైసీపీ వ్యతిరేక రాతల్ని ముమ్మరం చేశారు.
Recommended Video
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు -ఇంటి పైకప్పు తొలగించి బీభత్సం -8రోజుల పసికందు మృతి