గుంటూరు జిల్లాలో వై ఎస్ విగ్రహం ధ్వంసం .. వైసీపీ నేతల ఆగ్రహం.. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లో పార్టీల శ్రేణులు సంయమనం కోల్పోయి దాడులకు పాల్పడుతున్నారు . గ్రామాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. అసలు కారణమే లేకుండా గొడవలకు దిగుతున్నారు. తన్నుకు చస్తున్నారు. ఎన్నికల నేపధ్యంలో మొదలైన ఘర్షణలు ఎన్నికలు ముగిసాక కూడా రావణ కాష్టంలా రాష్ట్రాన్ని దహిస్తూనే ఉన్నాయి. ఒక్క దాడులే కాదు విగ్రహాలను ధ్వంసం చేయటం వంటి చర్యలతో రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి .
ఎన్నికల తర్వాత గుంటూరు జిల్లాలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక ఫ్లెక్సీల నుండి ప్రతి దానిపైనా పెద్ద రగడే నడుస్తుంది. తాజాగా గుంటూరు జిల్లా కాకుమాను లో మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటన నిన్న సాయంత్రం జరిగింది. ఇక్కడి చౌరస్తాలో ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం చేతులు విరిచారు. అయితే ఇది టీడీపీ శ్రేణుల చర్య అని విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ కెమెరాలు పరిశీలించి ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్య తీసుకుంటామని చెప్పారు. పోలీసులు, వైసీపీ నేతలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళన విరమించారు . అయినా గ్రామంలో మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయాందోళన ప్రజల్లో కనిపిస్తుంది. వై ఎస్ విగ్రహ ధ్వంసం నేపధ్యంలో దాడులకు పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.