మా నాన్న హత్య కేసులో మమ్మల్నే ఇరికించాలని చూస్తున్నారు. : వైఎస్ వివేకా కుమార్తె
న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం అనంతరం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన కుమార్తె డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాను కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. తన తండ్రిని హత్య చేసిన కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తన తండ్రి హత్య కేసులో తమ కుటుంబ సభ్యులనే ఇరికించే ప్రయత్నం సాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ నిష్పక్షపాతంగా లేదని ఆమె ఎన్నికల ప్రధాన కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. తన తండ్రి హత్య కేసును సీబీఐ లేదా ఎన్ఐఎ లతో విచారణ జరిపించేలా కేంద్రానికి సూచించాలని కోరారు. సిట్ దర్యాప్తు తీరు అనుమానాస్పదంగా ఉందని ఆమె అబిప్రాయపడ్డారు.
రాజకీయ-వ్యాపార ప్రయోజనాల కోసమే : ఆందోళన కు కారణమిదే : మోహన్ బాబు పై శివాజీ ఫైర్..!
కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ అధికారులను కూడా తాను కలుస్తానని సునీతా రెడ్డి తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వ ఆధీనంలో లేని దర్యాప్తు సంస్థకు తన తండ్రి హత్య కేసు అప్పగించాల్సిన అవసరం ఉందని అన్నారు. సిట్ దర్యాప్తును ప్రభావితం చేసేలా స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటనలు చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో నిష్పక్షపాత దర్యాప్తును ఆశించలేమని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.