వైఎస్ వివేకా హత్యకేసులో ఇంకా వీడని మిస్టరీ: జయంతి నాడు గుర్తు చేసుకున్న కుటుంబం
కడప: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దివంగత వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా గురువారం ఆయన కుటుంబ సభ్యులు నివాళి అర్పించారు. జిల్లాలోని పులివెందులలో నిర్మించిన వైఎస్ వివేకా ఘాట్ వద్ద ఈ ఉదయం ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వివేకా కుమార్తె సునీతమ్మ, ఇతర కుటుంబ సభ్యులు సమాధి వద్ద నివాళి అర్పించారు. మాజీ ఎమ్మెల్యే, రాజంపేట పార్లమెంటరీ ఇన్ ఛార్జి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వైఎస్ వివేకానందరెడ్డికి నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. వివేకా జయంతిని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
విగ్రహావిష్కరణ సెప్టెంబర్ 2కు వాయిదా..
దాదాపు అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళి అర్పిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి జయంతిని దృష్టిలో ఉంచుకుని ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించాల్సి ఉంది. ఆయన పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకుని బుధవారం రాత్రి ఆయన అమరావతికి రావాల్సి ఉంది. విదేశాంగ శాఖ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ హఠాన్మరణంతో పలువురి ప్రముఖులతో వైఎస్ జగన్ నిర్వహించాల్సిన భేటీ గురువారానికి వాయిదా పడింది. దీనితో వైఎస్ జగన్ షెడ్యూల్ లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో- వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ వాయిదా పడింది. వచ్చేనెల 2వ తేదీన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశాలు ఉన్నాయి.
వీడని చిక్కుముడి..
ఇదిలావుండగా- వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై నెలకొన్న మిస్టరీ చిక్కుముడి ఇంకా వీడలేదు. ఈ హత్యకేసులో నలుగురిని ప్రధాన నిందితులుగా గుర్తించారు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు. వైఎస్ వివేకా వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ఆయన సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి ప్రతాప్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డిలను అరెస్టు చేశారు. వారిపై విచారణ కొనసాగుతోంది. వైఎస్ వివేకా హత్యకు గల కారణాలేవీ ఇంత వరకూ స్పష్టంగా వెలికి రాలేదు. ఆర్థిక పరమైన అంశాలు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల వల్లే ఈ నలుగురు వైఎస్ వివేకాను హత్య చేయడానికి కుట్ర పన్ని ఉంటారని చెబుతున్నారు. ఈ నలుగురిలో ప్రతాప్ రెడ్డి, పరమేశ్వర రెడ్డిలే ప్రత్యక్షంగా హత్యోదంతంలో పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వారిపై ఇదివరకే నార్కో అనాలసిస్ పరీక్షలను సైతం నిర్వహించారు.
నార్కో అనాలసిస్ పరీక్షలు..
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్కు కోర్టు అనుమతిచ్చింది. వివేకా హత్యకేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేశారని అభియోగం ఉంది. దీంతో జైలు నుంచి బెయిల్పై వచ్చిన ఎర్ర గంగిరెడ్డికి టెస్ట్ విషయమై కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే వైఎస్ వివేకా హత్యోదంతంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇంటి వాచ్మెన్ రంగయ్య, శేఖర్ రెడ్డికి నార్కో టెస్ట్లను నిర్వహించారు పోలీసులు. ఇదివరకు వారికి నార్కో పరీక్షలు చేయాలన్న సిట్ విఙ్ఞప్తిని గతంలో పులివెందుల కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే కోర్టు నార్కో పరీక్షలకు ఓకే చెప్పింది. వైఎస్ వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగంపై మార్చి 28న పోలీసులు వారిని అరెస్ట్ చేయగా ఇన్నిరోజులుగా నిందితులు రిమాండ్లో ఉన్నారు.