తల్లిగా జగన్ చేసేది భారమే కానీ తప్పదుగా: విజయమ్మ, హైదరాబాద్లో వద్దంటే ఎలా
తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా భావించి అక్కున చేర్చుకోవాలని వైసిపి గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు
కడప: తన తనయుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పాదయాత్రలో మీ కొడుకుగా, తమ్ముడిగా, మనవడిగా భావించి అక్కున చేర్చుకోవాలని వైసిపి గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
Recommended Video
శ్రీవారిని దర్శించుకున్న జగన్: వందలమంది ఒకేసారి రావడంతో, మళ్లీ వివాదం?
సోమవారం జగన్ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. నా బిడ్డను అందరూ ఆశీర్వదించాలన్నారు.
వైయస్ పాదయాత్ర నుంచే తయారు చేసుకున్నారు
వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్రను ప్రజలు గుండెల్లో దాచుకొని, ఆయనను ఆదరించారని విజయమ్మ అన్నారు. ప్రజలకు వైయస్సార్ అందించిన ప్రతి సంక్షేమ పథకం పాదయాత్ర నుంచి పుట్టిందే అన్నారు. సంక్షేమ పథకాల బ్లూప్రింట్ను వైయస్ పాదయాత్ర నుంచే తయారు చేసుకున్నారని చెప్పారు.
జగన్కు బ్లూప్రింట్ ఇవ్వండి
ఇప్పుడు జగన్ చేస్తున్న పాదయాత్రను కూడా ఆదరించి, ఆశీర్వదించాలని విజయమ్మ కోరారు. ప్రజా సంక్షేమం కోసం ఆయనకు బ్లూప్రింట్ ఇవ్వాలని అభ్యర్థించారు. వైయస్ తన పాదయాత్ర సమయంలో అనేక మంది రైతులను, మహిళలను, వృద్ధులను కలిశారని చెప్పారు. ఎన్నో అంశాలను గమనించారన్నారు. అధికారంలోకి రాగానే వారికి లబ్ధి చేకూర్చే పథకాలు తెచ్చారన్నారు.
చంద్రబాబు ఎవరి అనుమతి తీసుకున్నారు, టీడీపీకి భయం
గతంలో చంద్రబాబు ఏ అనుమతితో పాదయాత్ర చేశారో చెప్పాలని విజయమ్మ నిలదీశారు. జగన్ పాదయాత్రను చూసి టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు. మూడున్నరేళ్లలో చంద్రబాబు ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు.
హైదరాబాదులో వద్దంటే ఎలా
వైయససార్ కాంగ్రెస్ పార్టీ లేకుంటే వైయస్ ప్రారంభించిన సంక్షేమ పథకాలు ఈ రోజు ఉండేవి కావని విజయమ్మ అన్నారు. హైదరాబాదులో ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదన్నారు. ఏపీలోని వారికి ఏపీలోనే ఆరోగ్యశ్రీ అంటున్నారని, హైదరాబాదులో వద్దనడం బాధగా ఉందన్నారు. ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు చంద్రబాబు హయాంలో ఆంక్షలు పెడుతున్నారన్నారు.
షర్మిల కూడా పాదయాత్ర చేశారు
నాడు వైయస్ జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల కూడా పాదయాత్ర చేసిందని విజయమ్మ గుర్తు చేశారు. నాడు ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు షర్మిల వైయస్ కూతురుగా, జగనన్న చెల్లిగా, జగన్ బాణంగా పాదయాత్ర చేశారని చెప్పారు. షర్మిల పాదయాత్రను ప్రజలు ఆదరించారన్నారు. షర్మిల పాదయాత్రతో ఎన్నో సమస్యలు పరిష్కారమయ్యాయని చెప్పారు. తన కూతురు షర్మిల పాదయాత్రను ఆదరించినట్లే జగన్ పాదయాత్రను ఆదరించాలని విజయమ్మ భావోద్వేగంతో చెప్పారు. జగన్ను మీ చేతుల్లో పెడుతున్నానని తాను ఆ రోజే చెప్పానని అన్నారు. జగన్కు ఒక్కసారి అవకాశమిచ్చి చూడాలని, అప్పుడు ఆయన తాను ప్రజలకు ఏం చేస్తారో చూడాలని అన్నారు. ఒక్కసారి అధికారంలోకి వస్తే చరిత్ర సృష్టించే పనులు చేస్తారన్నారు.
తల్లిగా నాకు జగన్ పాదయాత్ర భారమే, తప్పదుగా
పాదయాత్ర అంత సులభమైనది కాదని విజయమ్మ అన్నారు. తాను షర్మిల, వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూశానని, ఇప్పుడు జగన్ చేస్తున్నారన్నారు. తల్లిగా ఆయన పాదయాత్ర చేయడం తనకు బాధ, భారమేనని, కానీ తప్పదుగా అన్నారు.