వైఎస్ వివేకా హత్యకేసు విచారణకు బ్రేక్ పడే ఛాన్స్ ... రీజన్ ఇదే !!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్న నేపథ్యంలో ఈ కేసు త్వరలోనే తేలుతుంది అన్న భావన కలిగింది. ఇంతలోనే వైయస్ వివేకా హత్య కేసు విచారణకు కరోనా బ్రేక్ వేస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. ఈ కేసును విచారిస్తున్న విచారణ అధికారికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో, మిగతా అధికారుల లోనూ టెన్షన్ పట్టుకుంది.ఒకవేళ వారికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే కొద్దిరోజుల పాటు విచారణకు బ్రేక్ పడే పరిస్థితి కనిపిస్తుంది.
నకిలీ యూనివర్సిటీలు .. ఫేక్ డాక్టరేట్ లు ... పైసల కోసం గలీజ్ దందా
మూడు బృందాలుగా వివేకా హత్యకేసు విచారణ చేస్తున్న సీబీఐ
మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ ఏడాది జూలైలో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు మొదటి దఫా 15 రోజుల పాటు విచారణ జరిపారు. ఆ తర్వాత రెండో దఫా విచారణ కూడా జరిపారు . మూడు బృందాలుగా విడిపోయి హత్యకు గల కారణాలను సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా కొందరు, పులివెందుల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో మరికొందరు అధికారులు అనుమానితులను విచారణ జరుపుతూ కూపీ లాగుతున్నారు.
విచారణాధికారికి కరోనా ... ఐసోలేషన్ లోకి వెళ్ళిన విచారణాధికారి
ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి రావడం, సిబిఐ అధికారులు విచారణ లో వేగం పెంచడంతో త్వరలో కేసు తేలిపోతుందని భావిస్తుంటే, ఊహించనివిధంగా కరోనా సిబిఐ అధికారుల విచారణకు అడ్డు పడుతుంది. ఈ కేసును దర్యాప్తు చేసిన విచారణాధికారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇక కోవిడ్ భయం పట్టుకున్న మిగతా అధికారులు సైతం ఈరోజు కరోనా పరీక్షలు చేయించుకోనున్నారు. అంతేకాదు కరోనా సోకిన అధికారి విచారణలో భాగంగా విచారణకు హాజరైన అనుమానితులు కూడా కరోనా బారిన పడే అవకాశం లేకపోలేదు.
కేసు త్వరగా తేల్చాలని కోరుతున్న వివేకా కుటుంబం
ప్రస్తుతం కరోనా సోకిన సదరు విచారణాధికారితో కలిసి తిరిగిన బృందం నేడు కరోనా పరీక్షలు చేయించుకోనున్న నేపథ్యంలో ఒకవేళ బృందంలో మిగతా వారికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే మరోమారు వివేకా హత్య కేసు విచారణ కొద్దిరోజుల పాటు వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులను సిబిఐ విచారణ చెయ్యలేదు . వారిని కూడా విచారించి ఈ కేసును త్వరితగతిన చేయించాలని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, ఆయన భార్య సౌభాగ్యమ్మ డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
అమిత్ షా ను కలిసే ఆలోచనలో వివేకా కుటుంబం
కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు అపాయింట్మెంట్ కోసం గట్టిగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కలవాలని, కేసును త్వరగా తేల్చాలని ఆయనను విజ్ఞప్తి చేయాలని వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఒకపక్క సిబిఐ అధికారులు విచారణ జరుపుతున్నా,ఇప్పటివరకు ఈ కేసులో అసలు వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? దేనికోసం ఇదంతా చేశారు? ఇది రాజకీయ హత్యనా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది ఇంతవరకు తేలలేదు .