వివేకా హత్యకేసులో కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డికి నార్కో అనాలిసిస్ టెస్ట్ ...అనుమతించిన కోర్టు
వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది . ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యాడు. తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపారు. గత ప్రభుత్వం వై ఎస్ వివేకా హత్యకేసు విచారణకు సిట్ ను నియమించింది. అయితే గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కేసులో ఏ మాత్రం పురోగతి సాధించలేకపోయింది. దీంతో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త సిట్ ను నియమించి వై ఎస్ వివేకా హత్యకేసులో ఉన్న కుట్ర కోణాల్ని ఛేదించటానికి ప్రయత్నిస్తోంది .
వాచ్ మ్యాన్ రంగయ్య కే కాదు .. కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డి కి కూడా నార్కో పరీక్షలు
వివేకా హత్యకేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ఈ దర్యాప్తులో వాచ్ మ్యాన్ రంగయ్య ను విచారించిన సిట్ అధికారులు రంగయ్య నుండి సరైన సమాధానం రాబట్టలేకపోయారు. అందుకే కోర్టు అనుమతితో రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేయించటానికి హైదరాబాద్ తరలించారు. ఇక వైఎస్ వివేకా హత్యకేసులో కీలక పాత్రధారి అని భావిస్తున్న కిరాయి హంతకుడు శేఖర్ రెడ్డిని బుధవారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నిజాలు నిగ్గుతేల్చేందుకు నార్కోఅనాలసిస్ పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇక ఈ నేపధ్యంలోనే శేఖర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపరిచారు. శేఖర్ రెడ్డికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో వాదనలు జరిగాయి . ఈ పరీక్షలపై శేఖర్ రెడ్డి సమ్మతిని కూడా తెలుసుకున్న కోర్టు శేఖర్ రెడ్డికి కూడా నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శేఖర్ రెడ్డిని కూడా హైదరాబాద్ తరలించారు పోలీసులు.
దర్యాప్తు వేగవంతం చేసిన సిట్.. నార్కో పరీక్షల తర్వాతే నిజాలు నిగ్గు తేలే అవకాశం
ఘోరహత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఇంత కాలం అయినా ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అసలు ఎలా చంపారు? ఈ హత్యలో ఎంత మంది పాత్ర ఉంది ? వై ఎస్ వివేకా ఇంట్లో పని చేసే వారి సహకారం ఏమైనా ఉందా ? అసలు అత్యంత సౌమ్యుడిగా , అందరికీ ఇష్టమైన వ్యక్తిగా ఉన్న వై ఎస్ వివేకాను అంత దారుణంగా హతమార్చాల్సిన అవసరం ఎవరికి వచ్చింది వంటి అనేక ప్రశ్నలకు నేటికీ సమాధానం దొరకలేదు . అందుకే ఈ మర్డర్ మిస్టరీని ఛేదించటానికి కేసు దర్యాప్తు వేగవంతం చెయ్యటానికి ప్రభుత్వం.. అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. తాజాగా.. సిట్ అధికారులు, వివేకా వాచ్మెన్ రంగయ్యను, శేఖర్ రెడ్డిని విచారించారు.వారు చెప్తుంది నిజం కాదని గ్రహించి వారికి నార్కో అనాలిసిస్ టెస్ట్ లు చెయ్యాల్సిందిగా భావించి కోర్టు అనుమతితో హైదరాబాద్ పంపించారు .
నార్కో పరీక్షల్లో రంగయ్య , శేఖర్ రెడ్డి చెప్పేవే కీలకం .. అందరిలోనూ ఉత్కంఠ
నార్కో అనాలిసిస్ పరీక్షలపైన సిట్ అధికారులు ఎన్నో నమ్మకాలు పెట్టుకున్నారు. ఇక టెస్ట్ లలో వారు చెప్పే విషయాలను బట్టి ముందు ముందు కేసు దర్యాప్తు సాగనుంది అని భావిస్తున్నారు . ఇక ఈ టెస్ట్ లలో వారు ఏం చెప్తారనే ఉత్కంఠ అటు సిట్అధికారులలోనూ, ఇటు రాజకీయ వర్గాలలోనూ , మరోవైపు ప్రజల్లోనూ ఉంది . ఏది ఏమైనా వివేకా హత్యకేసులో కుట్ర కోణాల్ని ఛేదించి దోషులకు శిక్ష పడేలా చెయ్యాలని జగన్ సర్కార్ కృత నిశ్చయంతో ఉంది.