YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?
మాజీ మంత్రి,సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సంచలన వాంగ్మూలం ఇచ్చిన వాచ్మెన్ రంగయ్య ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎర్ర గంగిరెడ్డి తనను చంపేస్తానని బెదిరించాడని,మరికొందరితో ప్రాణహాని ఉందని రంగయ్య చెప్పడంతో పోలీసులు ఆయన ఇంటికి భద్రత కల్పిస్తున్నారు. ప్రస్తుతం రంగయ్య ఇంటి వద్ద పోలీసులు మఫ్టీలో కాపలా కాస్తున్నారు.రంగయ్యకు ఎటువంటి హాని జరగకుండా 24 గంటల భద్రతను ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తెర పైకి ముగ్గురి పేర్లు...
జమ్మలమడుగు మెజిస్ట్రేట్లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎర్ర గంగిరెడ్డి,సునీల్ యాదవ్,దస్తగిరి అనే ముగ్గురికి ఇందులో ప్రమేయం ఉందని రంగయ్య వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సునీల్ యాదవ్ను సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించిన సునీల్ యాదవ్ తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరడం గమనార్హం.
కోర్టులో సునీల్ యాదవ్ పిటిషన్...
వైఎస్ వివేకా హత్య కేసులో ప్రస్తుతం ముగ్గురి పేర్లు తెర పైకి రాగా... అందులో ఒకరైన సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు కోర్టులో రంగయ్య వాంగ్మూలం ఇస్తుండగానే సునీల్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఆంతర్యమేంటా అన్న చర్చ జరుగుతోంది.సునీల్ యాదవ్ యాదవ్ వెనుక ఏ శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ యాదవ్ గతంలో వైఎస్ వివేకా వద్దే చాలా కాలం పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో వివేకా ఆయన్ను దూరం పెట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో తన అనుమతి లేకుండానే నార్కో అనాలిసిస్,లై డిటెక్టర్ టెస్టులు చేస్తున్నారని సునీల్ యాదవ్ పేర్కొన్నారు. అంతేకాదు,తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.
Recommended Video
నూతన విచారణ అధికారి...
జమ్మలమడుగు మెజిస్ట్రేట్లో వాంగ్మూలం అనంతరం ఇంటికి చేరుకొన్న రంగయ్య... ఎర్ర గంగిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హత్య కేసుకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడిస్తే.. 'నిన్ను నరుకుతా... చంపుతా...' అని ఎర్ర గంగిరెడ్డి బెదిరించినట్లు రంగయ్య ఆరోపించారు. మరోవైపు గంగిరెడ్డి మాత్రం రంగయ్య ఆరోపణలను తోసిపుచ్చారు. రంగయ్య మద్యం మత్తులో ఆ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. అసలు ఆయనతో తనకు పరిచయమే లేదని... ఆయన్ను తాను ఎందుకు చంపుతానని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ హత్య కేసును డీఐజీ సుధా సింగ్ పర్యవేక్షిస్తున్నారు.నూతన విచారణ అధికారిగా ఎస్పీ రాం కుమార్ను నియమించారు.