వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్ ... వాచ్ మ్యాన్ రంగయ్య పాత్ర ఏంటి ?
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బాబాయి, సీనియర్ పొలిటీషియన్ , మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణంగా హత్యకు గురయ్యాడు. తన ఇంట్లో వివేకానందరెడ్డిని దుండగులు దారుణంగా గొడ్డళ్లతో నరికి చంపారు. ఎవరితోనూ గొడవలకు దిగని సౌమ్యుడు అని, అన్ని పార్టీల నేతలు ఇష్టపడే నాయకుడు అని మంచి పేరున్న వై ఎస్ వివేకా హత్యకేసులో ఉన్న కుట్ర కోణాల్ని ఛేదించటానికి జగన్ సర్కార్ సిట్ ను ఏర్పాటు చేసింది. దర్యాప్తు వేగవంతం చేసింది. ఇక ఈ దర్యాప్తులో వాచ్ మ్యాన్ రంగయ్య ను విచారించిన సిట్ అధికారులు రంగయ్య నుండి సరైన సమాధానం రాబట్టలేకపోయారు.
వివేకా ఇంటి వాచ్ మ్యాన్ రంగయ్యను విచారిస్తున్న సిట్ అధికారులు
ఘోరహత్యకు గురైన మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం.. అనంతపురం, చిత్తూరు, తిరుపతికి చెందిన పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇక గత నెలలో ఈ బృందం మరోసారి వివేకా ఇంటిని పరిశీలించింది. కడప జిల్లా ఎస్పీ అభిషేక్ మహంతి ఆధ్వర్యంలో ఈ బృందం దర్యాప్తు చేస్తోంది. అయితే టీడీపీ హయాంలో ఇదివరకే నియమించిన ఓ కమిటి వివేకానందరెడ్డి అనుచరులైన ఎర్రగంగిరెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిని ప్రధాన నిందితులని భావించి, వారిని విచారించారు . కానీ ఇప్పటికీ ఆయన మర్డర్ మిస్టరీగానే మిగిలింది. ఈ నేపథ్యంలోనే మరో సిట్ని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ కొత్తగా ఏర్పాటైన ఈ సిట్లో 23 మంది అధికారులు ఉన్నారు. తాజాగా.. సిట్ అధికారులు, వివేకా వాచ్మెన్ రంగయ్యను విచారించారు.
నార్కో అనాలిసిస్ పరీక్షలకు రంగయ్యను హైదరాబాద్ పంపిన అధికారులు .. అనుమతించిన కోర్టు
రంగయ్యను వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్న అధికారులు రంగయ్య నుండి సమాధానాలు రాబట్టలేకపోతున్నారు. వివేకా హత్య కేసులో రెండు రోజులుగా రంగయ్యను సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే వాచ్మెన్ రంగయ్య వివేకాహత్య కేసులో సరైన సమాధానం చెప్పలేదని సమాచారం. ఈ నేపధ్యంలో వివేకా హత్యకేసులో వాచ్మెన్ రంగయ్యకు నార్కో అనాలిసిస్ పరీక్షలు చేసేందుకు కోర్టును అనుమతి కోరగా , కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. రంగయ్యను నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షలకు అనుమతించాలని కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. మొదటిసారి నార్కో అనాలసిస్ కు అనుమతి ఇవ్వాలని పిటిషన్ వేయగా, దాన్ని కోర్టు తిరస్కరించింది. తర్వాత మళ్లీ పిటిషన్ వేయడంతో వారికి కోర్టు అనుమతి ఇచ్చింది.నార్కో పరీక్షల కోసం రంగయ్యను హైదరాబాద్కు తరలించారు.
Recommended Video
రంగయ్య చెప్పే సమాధానాలే కీలకం .. పురోగతి దిశగా వివేకా హత్యకేసు విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో పురోగతి దిశగా సిట్ అధికారులు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది .ఈ హత్యలో సాక్ష్యాలను తారుమారు చేశారన్న కోణంలో వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాశ్లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా, సరైన ఆధారాలు లేని కారణంగా ఇటీవలే వారికి పులివెందుల జూనియర్ సివిల్ జడ్జి బెయిలు మంజూరు చేశారు . తాజాగా సిట్ అధికారులు వివేకా ఇంటి వాచ్మెన్ రంగయ్యతో పాటు మరికొంత మంది ముస్లిములను పులివెందుల్లోని డిఎస్పి కార్యాలయానికి పిలిపించి విచారించారు. ఇక ఈ నేపధ్యంలోనే వాచ్ మ్యాన్ రంగయ్య కు నార్కో పరిక్షలు చెయ్యనున్నారు. రంగయ్య విషయం బయటపెడితే అసలేం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుంది.