వైఎస్ వివేకా హత్య కేసు అప్డేట్- పులివెందుల చెప్పుల డీలర్ల చుట్టూ సీబీఐ దర్యాప్తు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ రెండోదశ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు స్ధానికులను విచారించడంతో పాటు వివేకా ఇంటికి కూడా పలుమార్లు వెళ్లిన అధికారులు కీలక ఆధారాలు సంపాదించారు. వివేకా బతికున్న సమయంలో ఆయనతో గొడవలు పడినవాళ్లు, ఆయన సెటిల్ చేసిన వివాదాలపై సైతం సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు.
పులివెందులలో సీబీఐ విచారణ 15వ రోజు కొనసాగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందులకు చెందిన చెప్పుల వ్యాపారి మున్నాతో పాటు ఆయన భార్యను కూడా అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. వీరితో పాటు మరికొందరు చెప్పుల వ్యాపారులను కూడా సీబీఐ అధికారులు రెండురోజులుగా ప్రశ్నిస్తున్నారు. ఇవాళ ఒక్కరోజే నలుగురు అనుమానితులను కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరిలో ముగ్గురు కడప, ఒకరు పులివెందులకు చెందినవారు ఉన్నారు. వీరంతా చెప్పుల దుకాణం డీలర్లే.
పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను ఐదు రోజులుగా సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అతని ముగ్గురు భార్యలను అధికారులు విచారించారు. మూడు నెలల నుంచి పులివెందులలో మున్నా చెప్పుల దుకాణం మూసేశాడు.
కానీ ఆతనికి సంబంధించిన బ్యాంక్ లాకర్లో రూ.48 లక్షలు, 25 తులాల బంగారం గుర్తించారు. ఇంత డబ్బు ఎక్కడ్నుంచి వచ్చిందనే దానిపై సీబీఐ ప్రశ్నిస్తోంది. మున్నాకు చెప్పులు సరఫరా చేసే డీలర్లను సీబీఐ ఇవాళ విచారణకు పిలిచింది. వీరి వాంగ్మూలం కూడా నమోదు చేసింది.