వైఎస్ వివేకా హత్యకేసులో అనూహ్య మలుపు: సీబీఐకి అప్పగింత..హైకోర్టు ఆదేశాలు
అమరావతి: మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అనూహ్య మలుపు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్యకేసుపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ.. వైఎస్ వివేకా కుమార్తె, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ను హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పిటీషన్పై వాదనలను విన్న తరువాత.. విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలను జారీ చేసింది.
Recommended Video
వైఎస్ వివేకానంద హత్యకేసు: హత్యకు ముందు రోజు హోటల్లో బీటెక్ రవి, పరమేశ్వరరెడ్డి భేటీ..
ప్రకంపనలు రేపిన పొలిటికల్ మర్డర్..
వైఎస్ వివేకా హత్యోదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు చోటు చేసుకున్న ఈ రాజకీయ హత్య.. కలకలానికి దారి తీసింది. గత ఏడాది మార్చి 15వ తేదీన వైఎస్ వివేకా.. కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఆయన తల, నుదురుపై నరికిన గాయాలు కనిపించాయి. తన ఇంట్లో బెడ్రూమ్లో రక్తపు మడుగులో కనిపించారాయన. ఈ హత్యకేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సిట్తో దర్యాప్తు..
అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఈ హత్యోదంతంపై సమగ్ర విచారణ నిర్వహించడానికి ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ.. కేసు విచారణ కొలిక్కి రాకపోవడం పట్ల వివేకా కుటుంబ సభ్యులను తీవ్ర నిరాశకు గురి చేసింది. దీనితోొ వారు హైకోర్టును ఆశ్రయించారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగించడానికి ఈ కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని కోరుతూ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
అనుమానితులుగా పలువురి పేర్లు..
వైఎస్ వివేకా హత్యకేసులో కొందరు అనుమానితుల పేర్లను సునీత ఈ సందర్భంగా పిటీషన్లో పేర్కొన్నారు. ఇంటి వాచ్మన్ రంగయ్య, సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, శ్రీనివాసర్ రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, మాజీ మంత్రి ఆది నారాయణరెడ్డి, మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిల పేర్లను చేర్చారు.
సీబీఐకి అప్పగించడానికి అభ్యంతరాలు ఎందుకంటూ..
ఈ కేసును సీబీఐకి అప్పగించడానికి ప్రభుత్వం ఎందుకు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తోందంటూ విచారణ సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణ తుది దశలో ఉందని, ఈ సమయంలో సీబీఐకి అప్పగించడం వల్ల మరింత జాప్యం చోటు చేసుకుంటుందని అప్పట్లో ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ప్రభుత్వం ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీనితో మరోసారి సంచలనం చెలరేగినట్టయింది. ఈ హత్యలో ఎవరి ప్రమేయం ఉందనే విషయాన్ని సీబీఐ నిగ్గు తేల్చుతుందని, కొన్ని అనూహ్యమైన పేర్లు బయటికి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.