జగన్ను సీఎం చేయాలి, అందుకే వైసిపి ఓడింది: వైయస్ వివేకా సంచలనం
పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వారినే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని కడప జిల్లా జిల్లా సమన్వయకర్త వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు.
కడప: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వారినే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని చేయాలని కడప జిల్లా జిల్లా సమన్వయకర్త వైయస్ వివేకానంద రెడ్డి అన్నారు. జగన్ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.
చదవండి: కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన పవన్ కళ్యాణ్
శనివారం కడపలో కడప నియోజకవర్గం ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప, సీమ జిల్లాలను సస్యశ్యామలం చేయటానికి వైయస్ రాజశేఖర రెడ్డి భారీ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రారంభించారని చెప్పారు. ఆయన మృతి తర్వాత నత్తనడకన సాగుతున్నాయన్నారు.
జగన్ను సీఎం చేయాలి
మన కష్టాలు తెలిసిన వ్యక్తి మఖ్యమంత్రి అయితేనే ఈ కష్టాలన్నీ తీరుతాయని జగన్ను ఉద్దేశించి వివేకా అన్నారు. విభజన నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్లోని 4 సీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు వెనుకబడ్డాయని తేల్చారన్నారు. ఆ జిల్లాలను అభివృద్ధి చేయటానికి రాష్ట్రానికి అయిదు సంవత్సరాల పాటూ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని పార్లమెంటులో చెప్పగా ఇప్పటి కేంద్ర మంత్రి ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేశారన్నారు.
బాబు కేసు నుంచి బయటపడేందుకే
2014 ఎన్నికల ప్రచారంలో ఇప్పటి దేశప్రధాని నరేంద్ర మోడీ సాక్షిగా ఏపీకి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా అవసరమని చంద్రబాబు అన్నారని, ఇప్పుడు తన స్వార్ధం కోసం ఒక కేసు నుంచి బయటపడటానికి హోదా అంశాన్ని విస్మరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా రావాలంటే రాబోయే ఎన్నికల్లో వైసిపిని గెలిపించాలన్నారు. 3 జిల్లాలకు కూడలి వంటి ప్రాంతంలో నిర్మించాలనుకున్న బ్రహ్మణి ఉక్కుకర్మాగారం స్థానంలో సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నారు.
అతి విశ్వాసం వల్లే గెలవలేదని..
2014 ఎన్నికల్లో వైసిపి అతివిశ్వాసం మితిమీరిన ఉత్సాహం వల్లే అధికారంలోకి రాలేకపోయిందని వివేకా సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో వైసిపి తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు నైతిక విలువలను వదిలి టిడిపిలో చేరారన్నారు. వారు ఏ ముఖం పెట్టుకుని బతుకుతున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఛీ కొడుతున్నా ఒక ఎమ్మెల్యే టిడిపిలో మంత్రి పదవి కూడా తీసుకున్నారని విమర్శించారు. ప్రజల తీర్పును పరిహాసం చేసిన వారు ఫలితాన్ని అనుభవిస్తారన్నారు.
జగన్ సీఎం కావాలి
కడప లోకసభ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. కడప అభివృద్ధి చెందాలంటే జగన్ సీఎం కావాలన్నారు. చంద్రబాబు తనయుడు లోకేష్ నేరుగా ఎన్నికలకు వెళ్లి కనీసం వార్డు సభ్యుడిగా కూడా గెలవలేదని కడప ఎమ్మెల్యే అంజాద్బాషా అన్నారు . ఓటమి భయంతో దొడ్డిదారిన ఎమ్మెల్సీగా శాసనమండలికి వచ్చి మంత్రి పదవి తీసుకున్నారని విమర్శించారు.