వైయస్సార్ మానస పుత్రికకు బ్రేక్ : ఏపీ లో నిలిచిన ఆరోగ్యశ్రీ సేవలు...!!
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. సర్వర్ సమస్యతో నిలిచిపోయిన సేవలు నిలిచిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో.. ఏపీ మొత్తంగా శస్త్రచికిత్సలు ఆగిపోయాయి. రోగుల డిశ్చార్జికీ అనుమతులు అందటం లేదు. దిని కారణంగా 3 రోజులుగా ఆస్పత్రుల్లోనే రోగులకు పడిగాపులు తప్పటం లేదు. కొత్తవారిని చేర్చుకునేందుకూ ఆస్పత్రులు నిరాకరిస్తున్నాయి. డయాలసిస్ రోగులకు ఇక్కట్లు తప్పటం లేదు. మూడు రోజులుగా ఈ సమస్య కొనసాగుతున్నా..ప్రభుత్వం సీరియస్ గా తీసుకోలేదు. వైయస్సార్ మానస పుత్రిక ఆరోగ్య శ్రీని చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పదే పదే ఆరోపించిన జగన్ ..ఇప్పుడు తన పాలనలోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. సాంకేతిక సమస్యే అయినా.. దీని పరిష్కారం కోసం ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నదే చర్చకు కారణమైంది.
పాక్షికంగా నిలిచన ఆరోగ్య సేవలు..
ఏపీలో మూడు రోజుల నుండి ఆరోగ్య శ్రీ సేవలు పాక్షికంగా నిలిచిపోయాయి. శస్త్రచికిత్సలకు ముందస్తు అనుమతులు.. డిశ్చార్జులు ఆగిపోయాయి. ఆరోగ్యశ్రీ పరిధిలోని ఆస్పత్రుల్లో రోగులను చేర్చుకునేందుకు అనుమతులు లభించకపోగా.. ఇప్పటికే శస్త్ర చికిత్సలు పూర్తి చేసుకున్న రోగులను ఇంటికి పంపించేందుకు కూడా ట్రస్ట్ నుంచి అనుమతులు రావడం లేదు. ఈ మధ్య కాలంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సాఫ్ట్వేర్ మైగ్రేషన్ జరిగింది. టీసీఎస్ సంస్థ కేపీఎంజీ సంస్థకు మధ్య బయోమెట్రిక్ మైగ్రేషన్ జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ట్రస్ట్లో సాఫ్ట్వేర్ సేవలన్నీ కేపీఎంజీ సంస్థ అందిస్తోంది. మైగ్రేషన్ పూర్తైన తర్వాత ట్రస్ట్ అధికారులు కొత్త సర్వర్ను అందుబాటులోకి తెచ్చారు. అప్పటి నుంచి ట్రస్ట్ సేవలు చాలా నిదానంగా జరుగుతున్నాయి. గతంలో రోజుకు 40 ప్రీ ఆథరైజేషన్లు తీసుకునే ఆస్పత్రులు ఇప్పుడు రోజుకు రెండుమూడు మాత్రమే తీసుకోగలుగుతున్నాయి. మరోవైపు రోగులకు బయోమెట్రిక్ సేవలు పూర్తి నిలిచిపోయాయి. శస్త్ర చికిత్స అనంతరం బయోమెట్రిక్ తీసుకున్న తర్వాతే రోగులను డిశ్చార్జ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ సేవలు నిలిచిపోవడంతో రోగులు ఇంటికి వెళ్లేందుకు మూడు రోజులుగా ఆస్పత్రుల్లోనే ఎదురుచూస్తున్నారు.
ఫోన్ సమాచారంతో చేయమన్నా..
సర్వర్ సమస్య ఉన్నందున ఫోన్లో అనుమతులు ఇస్తామని ట్రస్ట్ అధికారులు నెట్వర్క్ ఆస్పత్రులకు సమాచారం ఇచ్చారు. అయినా, శస్త్ర చికిత్సలుచేసేందుకు ఆస్పత్రుల యాజమాన్యాలు భయపడుతున్నాయి. తాము రిస్క్ తీసుకోలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఫోన్లో అనుమతులు తీసుకున్న 24 గంటల్లో రోగి, శస్త్ర చికిత్స వివరాలను ట్రస్ట్కు పంపించాలని, లేకుంటే ఆ బిల్లులను ట్రస్ట్ చెల్లించదని పేర్కొంటున్నాయి. సాధారణ శస్త్ర చికిత్సలకైతే వారం తర్వాత రావాలంటూ ఆస్పత్రులు రోగులను వెనక్కి పంపించేస్తున్నాయి. ఎమర్జెన్సీ కేసులైతే డబ్బులు చెల్లిస్తేనే శస్త్ర చికిత్సలు చేయగలమని స్పష్టంగా చెబుతున్నాయి. కిడ్నీ రోగులు డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చే ప్రతిసారి ఆరోగ్యమిత్రలు బయోమెట్రిక్ తీసుకుంటారు. ప్రస్తుతం ఆ సేవలు నిలిచిపోవడంతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది డబ్బులిచ్చి డయాలసిస్ చేయించుకుంటున్నారు. మరికొంత మంది తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు.
తాత్కాలిక ఏర్పాట్లు సైతం చేయరా..
సాంకేతిక సమస్య కారణంగా ఆరోగ్యశ్రీ సేవలకు ఇబ్బంది ఏర్పడుతున్నా.. తాత్కాలిక ఏర్పాట్లు చేయడంలో ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రతి రోజు 2300 నుంచి 2500 వరకు ప్రీ ఆథరైజేషన్లు ఇస్తారు. గత మూడు రోజులు ప్రీ ఆథరైజేషన్లు 25 శాతానికి పడిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఆఫ్లైన్లో శస్త్ర చికిత్సలు, డిశ్చార్జులకు అనుమతులు ఇవ్వాలి. తిరిగి సర్వర్ అందుబాటులోకి వచ్చాక ఆ వివరాలను ఆన్లైన్ చేసుకునే అవకాశం ఉంది. అలా చేయకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.