వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన సీఎం జగన్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ముందుకు వెళుతున్న విషయం తెలిసిందే. అన్ని కులాల, అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్న జగన్ సర్కార్ ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టింది . వైయస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళల పొదుపు సంఘాల ఖాతాలలో ఉన్న అప్పు నాలుగు విడతలుగాతీర్చనుంది .
Recommended Video
వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మరో ఎన్నికల హామీని అమలుకు శ్రీకారం చుట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా, ప్రతిగగ్రామంలోనూ ఈ కార్యక్రమం తిలకించేలా ఏర్పాట్లు చేశారు . ఎన్నికలకు ముందు వైయస్సార్ ఆసరా పథకాన్ని అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి అమలు చేస్తాం అంటూ హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి నేడు వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు.
ఆర్ధిక సంక్షోభంలో ఉన్నా సరే .. ఇచ్చినమాటకు కట్టుబడి హామీల అమలు
కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక సంక్షోభంలో కొట్టు మిట్టాడుతున్నా సరే సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చటానికి నిర్ణయం తీసుకున్నారు .ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు . ఎన్నికల నాటికి ఉన్న మహిళా సంఘాల డ్వాక్రా రుణాలు అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిస్తామని హామీ ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని ప్రారంభించామని తెలిపారు.
మహిళా సంఘాల ఖాతాలలో రుణాలకు సంబంధించి తొలివిడత నగదు జమ
87 లక్షల మంది మహిళలకు 27 వేల కోట్ల రుణాలు ఉన్నాయని నాలుగు విడతల్లో వైఎస్ఆర్ ఆసరా ద్వారా రుణాల చెల్లింపు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మహిళా పొదుపు సంఘాల కు సంబంధించి తొలి విడతలో 6792 .20 కోట్లు జమ చేస్తున్నామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మహిళల పొదుపు సంఘాల ఖాతాలలో నేడు వైయస్సార్ ఆసరా పథకంలో భాగంగా తొలి విడత నగదు జమ చేయనున్నారు. నేడు ఈ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా 8,71,302 పొదుపు సంఘాలలో 87,74,674 మంది మహిళల బ్యాంకు ఖాతాలలో ఉన్న అప్పు 27,168.83 కోట్ల రూపాయలను పొదుపు ఖాతాలో జమ చేయడానికి తొలి అడుగు పడింది.
వారం రోజుల పాటు వైఎస్సార్ ఆసరా పథకం .. ఒక ఉత్సవంలా ..
నేడు తొలి విడతలో భాగంగా 6792.20 కోట్ల రూపాయలు ఆయా కార్పొరేషన్ల ద్వారా పొదుపు సంఘాల ఖాతాలలో జమ చేయబడతాయి. సీఎం జగన్ ఈ సందర్భంగా రాసిన లేఖలను సైతం మహిళలకు అందిస్తున్నారు . వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభోత్సవాన్ని వారం రోజుల పాటు ఉత్సవంలా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో ఏడు రోజుల కార్యక్రమాలకు రూప కల్పన చేశారు .