నేడే వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభం .. ఏపీ మహిళలకు ఆర్ధిక భరోసా ..ఒక్కో ఖాతాలో 18,750 జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మహిళల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పిన జగన్ నేడు జగనన్న చేయూత పథకాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. వైయస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీ మహిళలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ,తద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వెయ్యాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆ ప్రాజెక్ట్ లు కొత్తవి కాదు .. మాట్లాడేందుకు మేం సిద్ధం .. కేంద్రమంత్రికి సీఎం జగన్ ప్రత్యుత్తరం
వైఎస్సార్ చేయూత ద్వారా 25లక్షల మంది మహిళలకు లబ్ది
ఈ పథకంలో భాగంగా 25లక్షల మంది మహిళల కోసం ఈ సంవత్సరం 4,700 కోట్లు కేటాయించినట్లు గా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పేర్కొన్నారు. ఈ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయస్సు గల బీసీ ,ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ప్రతి సంవత్సరం 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లపాటు ఆర్థిక సహాయం అందించనున్నారు. మొత్తం వారికి 75 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నట్లుగా తెలుస్తోంది.
లబ్దిదారులకు సీఎం జగన్ లేఖ
ఈ నేపథ్యంలో వైయస్సార్ చేయూత లబ్ధిదారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా లేఖలు రాశారు. అక్క చెల్లెళ్ళు అందరికీ హృదయపూర్వక అభినందనలతోఅంటూ సాగిన లేఖలో అనేక అంశాలను పథకం ఉద్దేశాన్ని జగన్ స్పష్టం చేశారు. ఆగస్టు 12, 2020 నుండి వైయస్సార్ చేయూత కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలలోని 45 నుండి 60 సంవత్సరాల మధ్య ఉన్న పేద మహిళలందరికీ ఆర్థికంగా అండగా నిలబడేందుకు ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వెయ్యాలని కోరిన సీఎం జగన్
పాదయాత్ర సమయంలో రాష్ట్రంలోని మహిళల కష్టాన్ని చూసి, వారి బాధలు విన్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ తాను రాసిన లేఖలో ప్రస్తావించారు. అంతేకాదు తాము అందించే ఆర్థిక సహాయాన్ని, పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసుకోవడానికి కూడా తగిన మార్గాలను సూచిస్తామని , నిర్ణయం తీసుకోవాల్సింది మహిళ లేనని, వాటిని ఎలా ఉపయోగించాలి అన్న అంశంపై మహిళలకు పూర్తి స్వేచ్ఛ ఉందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
Recommended Video
నేడు పథకం ప్రారంభించి లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చెయ్యనున్న జగన్
ఈరోజు సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్న వైయస్సార్ చేయూత పథకంలో లబ్ధిదారులందరి ఖాతాల్లో జగన్ డబ్బులను జమ చేస్తారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు లబ్ధిదారులతో కలిసి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేసిన సెర్ఫ్, మెప్మా లు ఈ కార్యక్రమాన్ని అన్ని చోట్లా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. జగన్ మహిళలకు ఆర్ధిక భరోసా కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో లబ్దిదారులైన మహిళల ముఖాల్లో ఆనందం కనిపిస్తుంది .