వైఎస్సార్ చేయూత లెక్కల్లో బొక్కలివిగో - కష్టాలు వినాశనానికి కాదు - నారా లోకేశ్ గెలుపు సూత్రాలు
ఆంధ్రప్రదేశ్ లో మహిళల కోసం జగన్ సర్కారు మరో సంక్షేమ పథకానికి శ్రీకారంచుట్టింది. 45 నుంచి 60 ఏళ్ల మధ్యఉన్న 23 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75వేలు అందించే ''వైయస్సార్ చేయూత'' పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం ప్రారంభించారు. మొదటి విడత సాయంగా ఆన్ లైన్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ.18,750లు జమచేశారు. రాబోయే నాలుగేళ్లలో చేయూత పథకం ద్వారా రూ.17వేల కోట్లు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ లెక్కల్లో చాలా బొక్కలున్నాయని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
సంచైత మామూలుగా ఇవ్వలేదుగా - కూతుళ్లకు హక్కులపై చంద్రబాబు ట్వీట్.. బాబాయికి చెప్పండంటూ.
చేయూత కాదు.. చేతివాటం..
వైఎస్సార్ చేయూత పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తామంటూ జగన్ సర్కారు ప్రారంభించిన పథకం పచ్చి మోసమని, దాన్ని చేయూత అని కాకుండా ‘జగన్ చేతివాటం' అంటేనే బాగుంటుందని నారా లోకేశ్ అన్నారు. జగన్ ఎన్నికల హామీలో 45 ఏళ్లు నిండినవాళ్లకు పెన్షన్ ఇస్తానన్నారని, ఆ లెక్కన మహిళలకు ప్రతి ఏటా రూ.36 వేలు ఇవ్వాల్సి ఉంటుందని, ఐదేళ్లకు కలిపి మొత్తం రూ.1.80 లక్షలు అవుతుందని, అందుకే జగన్ రివర్స్ టెండరింగ్ ప్రక్రియను మొదలు పెట్టారని లోకేశ్ విమర్శించారు.
ఒక్కో మహిళకు రూ.1.05లక్షలు నష్టం..
‘‘జగన్ చెప్పినట్లు 45 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ ద్వారా ఐదేళ్లకు కలిపి ఒక్కో మహిళకు రూ.1.80లక్షలు వస్తాయి. కానీ మహిళల్ని చేయూత పథకంలో చేర్చడం ద్వారా మొత్తం కలిపి రూ.75,000 మాత్రమే ఇస్తామంటున్నారు. అంటే, ప్రతి ఏటా నష్టం రూ.17,250/-, 4 ఏళ్ళలో రూ.69,000. మొదటి ఏడాది ఎగనామం రూ.36000. మొత్తంగా ఒక్కో మహిళకు జగన్ రెడ్డి చేతివాటం రూ.1.05లక్షలన్నమాట'' అని లోకేశ్ వివరించారు.
పసుపు కుంకుమ vs చేయూత
టీడీపీ హయాంలో కోటి మంది మహిళలకు పసుపు కుంకుమ పథకం కింద మేలులు చేశామని, జగన్ సర్కారు మాత్రం మహిళా లబ్దిదారుల సంఖ్యను ఏకంగా 23 లక్షలకు తగ్గించి, వాళ్లలో వాళ్లకే విభేదాలు సృష్టిస్తున్నారని టీడీపీ నేత ఆరోపించారు. ఒకేసారి 75లక్షల మంది లబ్దిదారుల్ని తొలగించడం దారుణమని, వాళ్లు పేదలు కారా? అని నిలదీశారు. చాలా మంది పేద మహిళలకు ఆధార్ లో వయస్సు తప్పుగా నమోదు అయ్యిందని, వారు నిరక్షరాస్యులు కావడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా ఆధార్ లో వివరాలు మార్చుకొనే అవకాశమిచ్చి న్యాయం చేయాలని లోకేశ్ అభ్యర్థించారు.
మహిళలకు టీడీపీనే అండ..
తండ్రి ఆస్తిలో కుమారుడితో సమానంగా కుమార్తెకూ హక్కు ఉంటుందని, ఈ హక్కు పుట్టుకతోనే వస్తుందని సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడం శుభపరిణామమని టీడీపీ నేత లోకేశ్ అన్నారు. దేశంలో అందరి కంటే ముందే ఆడబిడ్డకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ద్వారా ఎన్టీఆర్ చైతన్య సారధిగా నిలిచారని, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చింది ఒక్క టీడీపీ మాత్రమేనని, మిగతా వాళ్లంతా కార్యరూపం దాల్చని చట్టాల పేరు చెబుతూ మహిళల్ని మోసం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇదే విషయంలో సుప్రీంతీర్పును స్వాగతించిన చంద్రబాబుకు మన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచైత గజపతిరాజు ఘాటుగా కౌంటరివ్వడం తెలిసిందే. ఇదిలా ఉంటే...
Recommended Video
యువతకు లోకేశ్ గెలుపు సూత్రాలు..
వినూత్న ఆలోచనలు, నైపుణ్యాభివృద్ధి నేటి యువత విజయానికి మార్గాలని, అందుకే సవాళ్ళను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని, గెలుపునకు ముందడుగు వేయాలని నారా లోకేశ్ సూచించారు. బుధవారం(ఆగస్టు 12) అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా యువత కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాలం మారుతోందని, కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ సందర్భంగా.. ‘‘కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు, నీ శక్తిసామర్ధ్యాలను బయటకు తీసి నువ్వెంటో నిరూపించుకునేందుకు వచ్చాయి. ఆ కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని'' అన్న అబ్దుల్ కలాం మాటల్ని అందరూ గుర్తుచేసుకోవాలని లోకేశ్ సూచించారు.
రష్యా కరోనా వ్యాక్సిన్ వెనుక చంద్రబాబు? - ఆ అమ్మాయి పుతిన్ కూతురు కాదు - 'స్పుత్నిక్-వి' కోలాహలం