షర్మిలపై గుర్రు, తల్లి సహా అందర్నీజగన్ పక్కన పెట్టారా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లుగా గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలను, బాబాయి వైవి సుబ్బారెడ్డిలను పక్కన పెట్టినట్లుగా పుకార్లు వినిపించాయి. అయితే వీటిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొట్టి పారేస్తోంది. సోమవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. షర్మిల అవసరమైనప్పుడు పార్టీ కోసం పని చేస్తారని, ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
ఇదిలా ఉండగా, జగన్ తన కుటుంబాన్ని పార్టీ వ్యవహారాలకు దూరంగా పెట్టడంతో వైయస్సార్ కాంగ్రెసు సమస్యలు ఎదుర్కొంటోందని జాతీయ పత్రికలో వార్తలు వస్తున్నాయి. పార్టీ వ్యవహారాల నుండి తల్లి విజయమ్మతో సహా అందరినీ పక్కన పెట్టాలని జగన్ నిర్ణయించుకున్నారని, ఇటీవల జరిగిన భేటీలో విజయమ్మ నిమిత్తమాత్రంగా మిగిలిపోయారని అంటున్నారు.
జగన్ జైల్లో ఉన్న పదహారు నెలలు ఆయన సోదరి షర్మిల మూడువేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారు. బాబాయి వైవి సుబ్బారెడ్డి పార్టీ స్థాపించినప్పటి నుండి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. వీరిని కూడా జగన్ పక్కన పెట్టారంటున్నారు. అక్టోబర్ నెలలో హైదరాబాదులో జరిగిన దీక్షకు షర్మిల హాజరు కాకపోవడం, ఆ తర్వాత ఇడుపులపాయలో వేర్వేరుగా నివాళులు అర్పించడం చూస్తుంటే విభేదాలు వచ్చినట్లే కనిపిస్తున్నాయంటున్నారు.
జగన్ లేనప్పుడు పార్టీని ముందుకు నడిపించిన షర్మిల పలువురుకి టిక్కెట్లు ఇప్పిస్తానని హామీలు ఇచ్చారట. ఇది జగన్ను ఆగ్రహానికి గురి చేసిందంటున్నారు. ఇక కడప పార్లమెంటు టిక్కెట్కు ఇప్పటికే అవినాష్ రెడ్డికి ఇచ్చేందుకు జగన్ హామీ ఇచ్చారు. కడప నుండి పోటీ చేసేందుకు షర్మిల ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. కడపలో పోటీ చేసేందుకు ఆమె తన భర్త అనిల్ కుమార్తో కలిసి గ్రౌండ్ వర్క్ కూడా చేశారట. ఇక వైవి సుబ్బారెడ్డి తన గైర్హాజరీలో పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు చేయడం జగన్కు రుచించలేదట. దీంతో ఒంగోలు టిక్కెట్ ఆశించిన ఆయనకు ఇప్పుడు హామీ లేదంటున్నారు.
కాగా, కుటుంబంలో విభేదాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొట్టి పారేస్తోంది. జగన్ జైల్లో ఉన్న కారణంగా షర్మిల, విజయమ్మలు పార్టీని నడిపించారని, జగన్ వచ్చాక ఆయన పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నందునే ఈ ప్రచారం జరుగుతోందని జగన్ పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కుటుంబం మొత్తం జగన్ వైపు ఉంటుందని చెబుతున్నారు.