కిరణ్ వ్యాఖ్యల వెనక కాంగ్రెసు అధిష్టానం: జగన్ పార్టీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు శ్రీకాంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం కిరణ్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. పదవీ కాలం ముగుస్తున్న దశలో ముఖ్యమంత్రి తన పదవిని తాగ్యం చేస్తానని ప్రకటించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి తన మాటలతో మభ్యపెడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం సీఎం కిరణ్ చేసిన వ్యాఖ్యలపై శ్రీకాంత్రెడ్డి పై విధంగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు యూపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులే ప్రధాన కారణమని ఆయన అన్నారు. వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమైక్య రాష్ట్ర తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశాఖ: కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నల్లోనే ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి నడుస్తున్నారని, ఇందులో భాగంగానే శుక్రవారం మీడియాతో వీరావేశంతో మాట్లాడారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ నిజంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే వెంటనే శాసన సభను సమావేశ పర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నానంటున్న ముఖ్యమంత్రి కిరణ్.. పార్లమెంట్ సభ్యుల రాజీనామాలను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలన్నారు.
విభజన కారకుడు బాబే: భూమా నాగిరెడ్డి
రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడే ప్రధాన కారకుడని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు తెలంగాణ వాదానికి కట్టుబడి ఉన్నారా లేక సమైక్యవాదానికి మద్దతు పలుకుతున్నారో స్పష్టం చేయాలని అన్నారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉంటే గతంలో తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖను చంద్రబాబు వెనక్కి తీసుకోవాలన్నారు. సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానంటున్న సీఎం కిరణ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని భూమా నాగిరెడ్డి అన్నారు.