టిడిపికి భయపడేది లేదు, దేనికైనా సిద్ధం: జగన్ పార్టీ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు అవసరమైతే ప్రాణత్యాగం చేసేందుకు కూడా సిద్ధమేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరైన అనంతరం ఇతర ఎమ్మెల్యేలతోపాటు ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక హోదా కోసం అసెంబ్లీని స్తంభింపజేస్తామని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం హోదాపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అవసరమైతే వందసార్లు బల్లలు ఎక్కుతానని, వెయ్యిసార్లు మైకు లాగుతానని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
టిడిపి బెదిరింపులకు భయపడేది లేదని , ఎమ్మెల్యేలుగా ప్రజల ఆకాంక్షలనే తెలియజేశామని ఎమ్మెల్యేలు ముత్యాలనాయుడు, సునీల్ కుమార్, సంజీవయ్య, జోగులు అన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను పట్టించుకోని ప్రభుత్వం తమ విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు.
ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ హక్కుల కమిటీ రెండోరోజు కూడా సమావేశమైంది. వర్షాకాల శాసనసభ సమావేశాల్లో సభాహక్కుల ఉల్లంఘనలకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైయస్సార్ కాంగ్రెస్ సభ్యులు కమిటీ ఎదుట హాజరయ్యారు.
హక్కుల కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి, తంబాల జోగులు, ముత్యాలనాయుడు, సునీల్, సంజీవయ్య హాజరై వివరణ ఇచ్చారు. మరో సభ్యుడు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున గైర్హాజరయ్యారు.
మొత్తం 12 మంది వైకాపా సభ్యులకు నోటీసులు జారీచేసిన సభాహక్కుల కమిటీ రోజుకు ఆరుగురు చొప్పున హాజరు కావాలని ఆదేశించింది. మంగళవారం దాడిశెట్టి రామలింగేశ్వరరావు, కొరుముట్ల శ్రీనివాసులు, చిర్ల జగ్గిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి హాజరుకాగా... కొడాలి వెంకటేశ్వరరావు, చెవిరెడ్డి భాస్కరరెడ్డి గైర్హాజరయ్యారు. కమిటీ ఎదుట హాజరుకాని ముగ్గురు సభ్యుల నుంచి డిసెంబర్ 2న వివరణ తీసుకుంటామని కమిటీ ఛైర్మన్ గొల్లపల్లి సూర్యారావు తెలిపారు.