కొత్తపల్లి గీత లాజిక్: జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేల ఫైర్
విశాఖపట్నం: అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు బుధవారం మండిపడ్డారు. తమ పార్టీ టిక్కెట్ పైన గెలిచిన గీత.. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కావడం ఏమిటని ప్రశ్నించారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి, మంత్రులను కలిశానని చెబుతున్న గీత అధికార దాహంతో టీడీపీ పంచన చేరే ఏర్పాట్లలో ఉన్నారని మహిళా ఎమ్మెల్యేలు తూర్పారబట్టారు. ఆమె చెప్పేదే నిజమైతే ఎంపీగా గెలిచినప్పటికీ ఇప్పటి వరకు గిరిజనులకు సంబంధించి ఎన్ని అంశాల పైన స్పందించారో చెప్పాలన్నారు.
తూర్పు గోదావరి ఏజె్సీ నుండి శ్రీకాకుళం వరకు ఏ ఒక్కరికీ కనీసం ముఖం కూడా తెలియకున్నా విద్యావంతురాలు అనే కారణంతో నమ్మి టిక్కెట్ ఇచ్చిన పార్టీని దగా చేస్తున్నారన్నారు. మోసం ఆమెకు వెన్నతో పెట్టిన విద్యగా ఉన్నట్లుగా కనిపిస్తోందన్నారు. రంపచోడవరం ఎమ్మెల్యే రాజేశ్వరి, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తదితరులు మండిపడ్డారు. మరో పార్టీతో సన్నిహితంగా ఉంటూ ఎలా విమర్శలు చేయడమేమిటని పుష్పశ్రీవాణి అన్నారు.
కాగా, చంద్రబాబును గీత కలిసిన విషయం తెలిసిందే. దీనిపై ఆమె మాట్లాడుతూ.. జగన్ ప్రధాని మోడీని కలిస్తే తప్పుకానప్పుడు తాను చంద్రబాబును కలవడం తప్పెలా అవుతుందని ఆమె లాజిక్ లాగారు. త్వరలోనే పలువురు మహిళా నేతలు పార్టీకి గుడ్ బై చెబుతారన్నారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమన్నారు. పలువురు మహిళా నేతలకు పార్టీలో అవమానం జరుగుతున్నా చెప్పుకోలేక లోలోన బాధపడుతున్నారన్నారు.