జగన్ వాకౌట్: అవగాహన లేకుండా ఆవేశంతో మాట్లాడారని పత్తిపాటి
హైదరాబాద్: రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ నిధులను మళ్లించినందుకు నిరసనగా ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సోమవారం శాసనసభ నుంచి వాకౌట్ చేశారు. రైతుల ఇన్పుట్ సబ్సిడీపై ప్రశ్నోత్తరాల సమయంలో ఆ విషయం చర్చకు వచ్చింది.
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని జనగ్ విమర్శించారు. కేంద్రం ఇచ్చిన వాటాను కూడా పూర్తిగా వినియోగించకుండా ఇతర రంగాలకు మళ్లించారని ఆయన వఅన్నారు. రెండేళ్లుగా రైతులకు బకాయిలను చెల్లించడం లేదని ఆయన అన్నారు.
రైతులకు కేవలం రూ.858 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారని ఆయన అన్నారు. రైతులను ఆదుకుంటామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు మరిచిపోయారని జగన్ అన్నారు. ఆ తర్వాత తాము శాసనసభ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పి సభనుంచి వెళ్లిపోయారు.
కాగా, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవగాహన లేకుండా ఆవేశంగా మాట్లాడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. అర్థం చేసుకోకుండా ఆవేశంగా మాట్లాడుతున్నారని, దానివల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందని ఆయన అన్నారు. జగన్కు అవగాహన లేదని, అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారని అన్నారు.