ద్రోహం అంతాఇంతా కాదు, ఇప్పుడే రాజీనామా..: బాబును ఏకేసిన జగన్ పార్టీ ఎంపీలు
అమరావతి/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా కూడేరులో పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు స్పందించారు.
అంతా మోసం, సినీ విలన్లే నయం! బీసీలకు అండగా ఉంటా: బాబుపై జగన్ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, విశాఖకు రైల్వే జోన్ కూడా ఇవ్వాల్సిందేనని ఎంపీలు తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేయడానికి ఇప్పటికీ తాము సిద్దమేనని స్పష్టం చేశారు.
రాజీనామాకు సిద్ధం
తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే.. స్పీకర్ ఫార్మట్లో ఇప్పటికిప్పుడే రాజీనామాలు చేస్తామని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాల అంశాన్ని మీడియా ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దది చేసి చూపుతున్నారని మండిపడ్డారు.
ఫిరాయింపు ఎంపీలు రాజీనామా చేయాలి
తమ పార్టీ నుంచి 9మంది ఎంపీలు ఎన్నికయ్యారని, వీరిలో నలుగురు(ఏపీలో ముగ్గురు, ఒకరు తెలంగాణలో) పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తెలిపారు. వీరిచేత కూడా రాజీనామా చేయించాలని డిమండ్ చేశారు.
బాబు ద్రోహం అంతా ఇంతా కాదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు చేస్తున్న ద్రోహం అంతా ఇంతా కాదని ఎంపీలు మండిపడ్డారు. తాను చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు కేంద్రంతో రాజీ చేసుకుంటున్నారని అన్నారు. రాష్ట్రానికి నిధులు రాకుండా వైసీపీ అడ్డుకుంటోందని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు కేవలం కుంటిసాకేలేనని ఎంపీలు అన్నారు.
పార్లమెంటులో మేముండాలి.. లేదంటే..
తాము రాజీనామా చేస్తే పార్లమెంటులో ప్రత్యేక హోదా కోసం గళమెత్తేవారే ఉండరని చెప్పారు. పార్లమెంటులో ప్రత్యేక హోదాపై చర్చ జరగాలంటే తాము సభలో ఉండాల్సిన అవసరం ఉందని ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు.