స్పీకర్పై జగన్ అవిశ్వాసం! బాబు పాపాత్ముడని రోజా
హైదరాబాద్: సభాపతి కోడెల శివప్రసాద్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో ఉంది. సభాపతి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం శాసన సభ నుండి వాకౌట్ చేసిన అనంతరం జగన్, సీనియర్ ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్కు బయలుదేరారు. సభలో జరిగిన విషయంపై ఆయన గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేస్తారు. అనంతరం స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది.
స్పీకర్ పైన ఆగ్రహం
సభాపతి కోడెల శివప్రసాద్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. జగన్ మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారని ధ్వజమెత్తారు. వారు చేసిన తప్పులను కూడా తాము ఎత్తి చూపవద్దా అని ప్రశ్నించారు. అన్నం పెట్టిన స్వర్గీయ నందమూరి ఎన్టీఆర్కు చంద్రబాబు, యనమల, గోరంట్ల వంటి నేతలు వెన్నుపోటు పొడిచారన్నారు.
ఎన్టీఆర్ను చంపిన పాపాత్ముడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసినప్పుడు.. అసెంబ్లీ ఇక్కడ ఎందుకని ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవన్లో అసెంబ్లీ పెట్టుకోవాలన్నారు. టీడీపీ సభ్యుల వలే తమను కూడా ఏపీ ప్రజలు గెలిపించారనే విషయం టీడీపీ గుర్తుంచుకోవాలన్నారు.
అధికార పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని చెవిరెడ్డి భాస్కర రెడ్డి అన్నారు. అలా వ్యవహరిస్తున్నందుకు వారు సిగ్గుపడాలన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు రాళ్లతో కొడతారని హెచ్చరించారు. మీడియా పాయింట్ వద్ద కూడా తమను మాట్లాడనివ్వడం లేదన్నారు.