హేమామాలిని వ్యాఖ్యలు: వాసిరెడ్డి, డికె అరుణ ఫైర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ బాలీవుడ్ నటి హేమమాలిని ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె వ్యాఖ్యలపై సామాజిక వేత్తలు, రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బృందావనంలో నివసిస్తున్న వితంతు మహిళల పట్ల ఆమె ఇటీవల వ్యాఖ్యలు చేశారు.
ఆమె చేసిన వ్యాఖ్యల పైన పలువురు రాజకీయ నేతలు మండిపడుతున్నారు. బృందావనంలోని షెల్టర్ హోంలలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన వితంతువులు ఉండటాన్ని హేమమాలిని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాల పేరుతో ప్రజలను ఎలా విడగొడతారని ఆమె ప్రశ్నించారు.
వితంతువులు, నిరాశ్రయులు తమ శేషజీవితాన్ని బృందావనం లాంటి పవిత్రస్థలంలో గడుపాలనుకోవడం తప్పా? అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఓ మహిళ ఎంపి అయిన హేమామాలిని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్ణకరమని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత డికె అరుణ అన్నారు.
బృందావనం లాంటి పవిత్రస్థలాన్ని ఒక రాష్ట్రానికి పరిమితం చేసే వ్యాఖ్యలు సరికాదని డికె అరుణ అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను హేమామాలిని నుంచి ఆశించలేమని చెప్పారు. బృందావనంలో ఇప్పటికే 40వేల మంది వితంతు మహిళలు ఉన్నారని, పశ్చిమబెంగాళ్, బీహార్ రాష్ట్రాల వారు కూడా ఇక్కడికే వస్తే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని హేమామాలిని ఇటీవల వ్యాఖ్యానించారు.