వైసీపీ..ఘర్ వాపసీ షురూ: ఒకే దెబ్బకు రెండు పిట్టలు: ఆ కుటుంబం సొంత గూటికి
కర్నూలు: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త రాజకీయ వ్యూహాలకు తెర తీసింది. ఇప్పటికే సగం ఖాళీ అయిన తెలుగుదేశం పార్టీ నుంచి మరింత మందిని చేర్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికోసం కొత్తగా 'ఘర్ వాపసీ'ని చేపట్టింది. పార్టీని వీడి వెళ్లిన వారందరినీ మళ్లీ చేర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన సంకేతాలను పంపించింది. ఈ వ్యూహం సత్ఫలితాలను ఇస్తోంది. కర్నూలు జిల్లాకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ తమ సొంతగూటికే వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఘర్ వాపసీ పథకం.. రాష్ట్ర రాజకీయాల్లో ఓ కుదుపును తీసుకుని వస్తుందని అంటున్నారు.
ఎన్నికలకు ముందు పార్టీని వీడిన వారందర్నీ చేర్చుకునే ప్రయత్నం..
తెలుగుదేశం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ నుంచి పలువురు నాయకులు పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు గోడ దూకారు. వారితో పాటు క్యాడర్ మొత్తం తెలుగుదేశంలో చేరింది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా పరాజయం పాలైంది. వైఎస్ఆర్ సీపీని వీడి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో చాలామందికి టికెట్లు దక్కలేదు. టికెట్లు దక్కిన వారు ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం అలాంటి నాయకులందరికీ తెలుగుదేశంలో ఏ మాత్రం ఆదరణ దక్కట్లేదని తెలుస్తోంది. పార్టీ ఫిరాయించి వచ్చిన నేతలకు కనీస విలువ ఇవ్వట్లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారు మళ్లీ తమ సొంత గూటికి చేరుకోవాలని ఆశిస్తున్నారు.
ఘర్ వాపసీ వారి కోసమే..
తెలుగుదేశంలో ఆదరణకు నోచుకోని వారందర్నీ తిరిగి పార్టీలోకి చేర్చుకోవడానికి ఘర్ వాపసీని చేపట్టింది వైఎస్ఆర్ సీపీ. దీని ప్రభావం కర్నూలు జిల్లాపై పడింది. ఎన్నికల సమయంలో తనకు టికెట్ దక్కలేదనే కారణంతో తెలుగుదేశం పార్టీలో చేరిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి తన సొంత గూటికి చేరుకోవడానికి సిద్ధపడ్డారని తెలుస్తోంది. తన భర్త గౌరు వెంకటరెడ్డితో కలిసి మళ్లీ సొంత పార్టీలో చేరాలను ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాండ్ర శివానంద రెడ్డి సలహ మేరకే గౌరు చరితారెడ్డి, ఆమె భర్త వైసీపీని వీడారు. మాండ్ర శివానంద రెడ్డి స్వయనా గౌరు చరితకు బావ వరుస అవుతారు.
వైఎస్ కు ఆప్తుడు గౌరు వెంకట రెడ్డి..
గౌరు వెంకట రెడ్డి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. గౌరు వెంకట రెడ్డి ఓ హత్యకేసులో కర్నూలు జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో.. ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను పలకరించి వచ్చారు. అప్పట్లో ఈ ఘటన రాజకీయంగా సంచలనాన్ని రేపింది. అయినప్పటికీ- వైఎస్ వాటిని ఏ మాత్రం పట్టించుకోలేదు. గౌరు వెంకట రెడ్డి తన మిత్రుడని, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించకూడదా? అని కౌంటర్ అటాక్ ఇచ్చారు వైఎస్. అనంతరం గౌరు వెంకట రెడ్డి భార్య చరితను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అనంతరం ఆ స్థానం ఎస్సీ రిజర్వుడ్ గా మారడంతో పాణ్యం నుంచి పోటీ చేయించి, గెలిపించుకున్నారు. ఆ తరువాత ఆమె పార్టీని వీడిపోయారు.
గౌరు కుటుంబంతో పాటు మరికొందరు..
గౌరు కుటుంబంతో పాటు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సైతం తమ సొంత గూటికి చేరుకునే అవకాశాలు లేకపోలేదు. తాము తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయామని, రాజకీయంగా తమ సమాధిని తామే తవ్వుకున్నామని అంటూ మణిగాంధీ అప్పట్లోనే సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే బాటలో మరికొందరు మాజీ వైఎస్ఆర్ సీపీ నేతలు సొంత గూటికి చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు
వైసీపీ చేపట్టిన ఘర్ వాపసీ వల్ల ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్టవుతుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులను చేర్చుకుంటూ భారతీయ జనతాపార్టీ జోరు చూపిస్తోంది. ఘర్ వాపసీని ప్రారంభించడం వల్ల బీజేపీ రాష్ట్రశాఖ నేతల దూకుడుకు అడ్డకట్ట పడినట్టవుతుందని అంటున్నారు. వైఎస్ఆర్ సీపీలో చేరడానికి ముఖం చెల్లకపోవడం వల్లే పలువరు నేతలు బీజేపీ వైపు చూపులు సారించారని, అదే సమయంలో వైసీపీ గనక తలుపులు తెరిస్తే- పాత నేతలందరూ మళ్లీ సొంతగూటికి రావడం ఆరంభిస్తారని, దీనివల్ల అటు టీడీపీ, ఇటు బీజేపీని దెబ్బకొట్టినట్టవుతుందని చెబుతున్నారు.