జగన్ పార్టీ ఎమ్మెల్యే కాపు అరెస్ట్: ఇంట్లో సోదాలు
ప్రస్తుతం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న బళ్లారిలోని ఆయన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. చీరలు, కుక్కర్లు, క్రికెట్ సామాగ్రి, 43 లక్షల విలువైన చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో బళ్లారిలోని రూరల్ పోలీస్ స్టేషన్లోను ఆయనపై కేసు నమోదయ్యింది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, రాయదుర్గం శాసనసభ్యుడు కాపు రామచంద్రారెడ్డి ఫొటోలతో ఉన్న గోడ గడియారాలను బెంగళూరు నుంచి బళ్లారి మీదుగా అనంతపురం జిల్లా రాయదుర్గం తరలిస్తుండగా బళ్లారి పోలీసులు గురువారంనాడు పట్టుకున్న విషయం తెలిసిందే.
గోడ గడియారాలు బళ్లారి నగరానికి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లు సిటీ డీఎస్పీ మురుగణ్ణవర్కు సమాచారం అందడంతో ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. స్థానిక మోతీ సర్కిల్లోని ఇందిరా ట్రాన్స్పోర్టుకు బెంగళూరు నుంచి పెద్ద సంఖ్యలో బాక్సులు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సోదాలు నిర్వహించారు.
బాక్సుల్లో ఉన్న 600కు పైగా గోడ గడియారాలను గుర్తించి, జిల్లా ఎన్నికల అధికారి బిస్వాస్కు సమాచారం అందించారు. ఆయన వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సమాచారాన్ని అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ లోకేష్ కుమార్కు అందించారు.
కోర్టుకు కాపు
కాపు రామచంద్రా రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఆయనను మధ్యాహ్నం రాయదుర్గం న్యాయస్థానంలో హాజరుపర్చారు.