అనంతలో వైసీపీ నాయకుడి దారుణ హత్య
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాప్తాడులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత హత్యకు గురయ్యారు. బుధవారం ఈ సంఘటన జరిగింది. తహసీల్దార్ కార్యాలయంలో వైసీపీ నేత ప్రసాద్ రెడ్డిని దుండగులు వేటకొడవళ్లతో నరికారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ప్రసాద్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీవర్గా కూడా పని చేశారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
పెదదండ్లూరులో ఒకరి దారుణహత్య
కడప జిల్లాలోని జమ్మలమడుగు పరిధిలోని పెదదండ్లూరులో చంద్రశేఖర్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రశేఖర్ను హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేస్తున్నారు.
దుర్గగుడి గోశాలలో ఏడు ఆవులు మృతి
కృష్ణా జిల్లా విజయవాడలోని దుర్గ గుడి దగ్గర గోశాలలో ఏడు ఆవులు మరణించాయి. మరో పది, పదిహేను ఆవుల పరిస్థితి విషమంగా ఉంది. విషాహారమే ఆవుల మృతికి కారణమని నిర్వాహకులు అంటున్నారు. మంగళవారం సాయంత్రం ఓ స్వచ్చంధ సంస్థకు చెందిన ప్రతినిధులు ఆహారం పెట్టినట్లుగా తెలుస్తోంది. వైద్యులు ఆవులకు చికిత్సను అందిస్తున్నారు.