వికీపీడియ వేదికగా టీడీపీ - వైసీపీ వార్! వైవీ సుబ్బారెడ్డి మతాన్ని రచ్చ చేసిన టెక్కీస్
తిరుపతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, లోక్సభ మాజీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మతంపై పెద్ద రచ్చ సాగుతోంది. ప్రతి ఒక్కరూ సవరించడానికి అవకాశం ఉన్న వికీ పీడియా వేదికగా వైఎస్ఆర్ సీపీ, తెలుగుదేశం మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. వైవీ సుబ్బారెడ్డి హిందువా? కాదా? లేక ఆయన క్రైస్తవ మాతాన్వీ స్వీకరించారా? అనే అంశం చుట్టూ ఈ వివాదం నడుస్తోంది. ఈ విషయంలో వికీ పీడియాలో వైవీ సుబ్బారెడ్డికి సంబంధించిన పేజీని కొన్ని గంటల వ్యవధిలో సుమారు 94 సార్లు ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది.
అసలు కారణమేంటీ?
వైఎస్ఆర్ సీపీకి చెందిన సీనియర్ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన దగ్గరి బంధువు కూడా. వైఎస్ జగన్ టీమ్లో కీలక నేత. రాజకీయ వ్యూహాలను పకడ్బందీగా రచించడంలో దిట్ట. 2014 లోక్సభ ఎన్నికల్లో ఆయన ఒంగోలు నుంచి విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వలేదు వైఎస్ జగన్. పార్టీ కార్యకలాపాలను విస్తృతం చేయడం, క్షేత్రస్థాయిలో క్యాడర్ను ఏకం చేయడం, పార్టీ ఘన విజయం సాధించడానికి ఆయన సేవలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో.. వైఎస్ జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా.. పార్టీ కార్యక్రమాల వైపు ఆయన దృష్టిని మళ్లించారు.
ఊహించినట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీనితో ఇక వైవీ సుబ్బారెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితో- ఒక్కసారిగా వైవీ సుబ్బారెడ్డి పేరు వార్తల్లోకి ఎక్కింది. మతం చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఆయన పేరు ఖరారు చేశారంటూ వార్తలు వచ్చిన మరుక్షణమే ఈ వివాదం రాజుకుంది.
వికీ పీడియాలో 94 సార్లు సవరణ
క్రైస్తవ మతాన్ని స్వీకరించిన రాజకీయ నాయకుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బాధ్యతలను ఎలా అప్పగిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చను లేవదీశారు కొందరు టెక్కీలు. వారంతా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులేనని ఆ పార్టీ నిర్ధారించింది కూడా. టీటీడీ ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి పేరు వినిపించగానే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు వెంటనే రంగంలోకి దిగారు. వికీ పీడియాలో వైవీ సుబ్బారెడ్డికి చెందిన పేజీని ఎడిట్ చేయడం ఆరంభించారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన హిందువగా సవరించేశారు. దీన్ని చూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు.. మళ్లీ దాన్ని సవరించే పనిలో పడ్డారు. ఇలా ఏకంగా 94 సార్లు వికీ పీడియా పేజీ సవరణకు గురైంది.
వైవీ సుబ్బారెడ్డి మతమేంటీ?
నిజానికి వైవీ సుబ్బారెడ్డి పక్కా హిందువు. అందులో సందేహాలు అనవసరం. తరచూ ఆయన అయ్యప్ప మాలదారణ చేస్తుంటారు. ఏటా శబరిమలకు వెళ్తుంటారు. ఆయన జీవిత కాలంలో ఇప్పటిదాకా 12 సార్లు శబరిమలకు వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకుని వచ్చారని చెబుతున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. అన్ని పండగలను నిర్వహిస్తారు. శివరాత్రి వంటి సందర్భాల్లో వైవీ సుబ్బారెడ్డి నివాసంలో యజ్ఞయాగాదులను నిర్వహిస్తుంటారని ఆయన అభిమానులు స్పష్టం చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను వారు సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. వైవీ సుబ్బారెడ్డి దంపతులు గోవులను పూజించడం సర్వ సాధారణం అని చెబుతున్నారు.
వైఎస్ జగన్ బంధువు కావడం వల్లే..
వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు దగ్గరి బంధువు. వరుసకు చిన్నాన్న అవుతారు. వైవీ సుబ్బారెడ్డి తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి వరుసకు సోదరులు. వైఎస్ కుటుంబం క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. దీన్ని ఆధారంగా చేసుకుని వైవీ సుబ్బారెడ్డి కూడా క్రైస్తవుడేనని వికీపీడియా ద్వారా వెల్లడించడానికి తెలుగుదేశం సానుభూతిపరులైన కొందరు టెక్కీలు విఫల ప్రయత్నం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రయత్నాలను వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా ప్రతినిధులు సమర్థవంతంగా తిప్పికొట్టగలిగారని అంటున్నారు.