టిపై కుదరదని కిరణ్: 'జగన్' ఎమ్మెల్యేల ధర్నా, అరెస్ట్
హైదరాబాద్: అసెంబ్లీని వెంటనే సమావేశపర్చి సమైక్యాంధ్రపై తీర్మానం చేయాంచాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. దానికి ఆయన కుదరదని చెప్పడంతో ముఖ్యమంత్రి చాంబర్ ఎదుట వారు బైఠాయించి ధర్నాకు దిగారు.
శుక్రవారం మధ్యాహ్నం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిశారు. అసెంబ్లీని వెంటనే సమావేశపర్చాలని కోరారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా తీర్మానం చేయించాలని విజ్ఞప్తి చేశారు. దానికి కిరణ్ కుదరదని చెప్పారు. అలా చేయడం వల్ల ప్రయోజనముండదని చెప్పారు. ముందే సమావేశపర్చడం కాకుండా తీర్మానం వచ్చినప్పుడే ఓడిద్దామను ముఖ్యమంత్రి వారికి సూచించారు.
దీంతో ఎమ్మెల్యేలు బయటకు వచ్చి చాంబర్ ఎదుట బైఠాయించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని, తీర్మానం చేయాలని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారిని సైఫాబాద్ పోలీసు స్టేషన్కు తరలించారు.
కిరణ్ను కలిసి బైఠాయించిన వారిలో శోభా నాగి రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, కాటసాని, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, సుచరిత, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన కృష్ణదాసు, గొల్ల బాబూరావు తదితరులు ఉన్నారు.
సచివాలయంలో భద్రత
తమ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని గురువారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెల్యేలు సచివాలయంలో సిఎంతో భేటీ అనంతరం ఆందోళనకు దిగారు. సచివాలయానికి ఎమ్మెల్యేలు వస్తున్నారని తెలియడంతో ఆందోళన చేస్తారని ముందే భావించిన పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.