రామోజీతో భేటీ, జగన్ సన్నిహితుల అసంతృప్తి!: మైండ్గేమా, మడమ తిప్పాడా?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును కలవడంపై పలు రకాల ఊహాగానాలు వినిపించాయి.. వినిపిస్తున్నాయి.
వైయస్ జగన్ ప్రత్యేక హోదా విషయమై రామోజీ రావుతో చర్చించాడని కూడా వార్తలు వచ్చాయి. మరోవైపు, రామోజీ రావును కలవడం ద్వారా జగన్ తెలుగుదేశం పార్టీతో మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది.
రామోజీ రావు తమకు అండగా నిలుస్తారనే భావన టిడిపి క్యాడర్లో కల్పించేందుకు జగన్ అలా వ్యవహరించి ఉంటారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇసుక మాఫీయా పైన ఈనాడు ప్రత్యేక కథనాలు ఇస్తోందని అంటున్నారు. ఇది, జగన్ - రామోజీ రావుల కలయికకు తొలి అడుగుగా కూడా భావించవచ్చుననే వారు కూడా లేకపోలేదు.
మొత్తానికి, రామోజీ రావు - జగన్ కలయికల పైన ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. అయితే, అందులో నిజం ఏమిటనేది తెలియాల్సి ఉంది. అయితే, కీలకమైన వారు మాత్రం దీని పైన మౌనంగా ఉంటున్నారని అంటున్నారు. జగన్, రామోజీ రావుల భేటీ పైన వారికి చెందిన పత్రికల్లో కనిపించలేదు.
జగన్ సన్నిహితుల అసంతృప్తి?
రామోజీ రావుతో జగన్ కలవడంపై వైసిపి నేతలు, జగన్ సన్నిహితులు కొందరు అసంతృప్తితో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిల్లో రామోజీని కలవడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారని తెలుస్తోంది. జగన్ నిత్యం తాను మడమ తిప్పనని చెబుతుంటాడని, ఇప్పుడు రామోజీని కలవడం రాజకీయ తప్పిదం కాదా అనే చర్చ పార్టీలోను సాగుతోందని సమాచారం.