జగన్, రోజాపై భగ్గు, సభలో ఉండనని ఎమ్మెల్యే సవాల్
హైదరాబాద్: అంగన్వాడీ కార్యకర్తల ఛలో హైదరాబాద్ ఉద్రిక్తం నేపథ్యంలో... ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ అసెంబ్లీలో ఈ అంశాన్ని మంగళవారం నాడు లేవనెత్తింది. అంగన్వాడీ సమస్యల పైన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైసీపీ మండిపడింది. అవసరమైతే తాను అంగన్వాడీ కార్యకర్తల పరామర్శకు వెళ్తానని జగన్ చెప్పారు.
ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... అంగన్వాడీ సమస్యల పైన ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. అంగన్వాడీల కోసం గతంలో వైయస్కు వ్యతిరేకంగా పోరాడిన రోజాకు.. ఇప్పుడు ఆ పార్టీ తరఫున మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని ఎద్దేవా చేశారు. కాగా, అంగన్వాడీ కార్యకర్తలకు మద్దతుగా వెళ్లిన పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేశారు.
అంగన్వాడీ కార్యకర్తల సమస్యపై మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. వైసీపీ సభ్యులు రాజకీయ దురుద్దేశ్యంతో సభను అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్నారు. సభా సమయాన్ని వృధా చేయవద్దని విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
నదుల అనుసంధనంపై...
నదుల అనుసంధానం పైన సభలో చర్చ సాగింది. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ.. పోలవరం పైన తమకు చిత్తశుద్ధి ఉందన్నారు. ముంపు మండలాల విలీనమే తమ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. వ్యంగ్య వ్యాఖ్యలతో ఏపీ ఇమేజ్ దెబ్బతీయవద్దని వైసీపీకి హిదవు పలికారు.
రాయలసీమకు నీరు ఇచ్చి తీరుతామన్న అధికార పార్టీ హామీపై వైసీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... రాయలసీమ పైన ఇప్పటికైనా టీడీపీకి ప్రేమ కలిగినందుకు సంతోషమని చెప్పారు. ఏడాదిలో నీరు ఇవ్వకుంటే తాను సభలో అడుగు పెట్టనని సవాల్ చేశారు.