టిలో జగన్ రెడీ: షర్మిలకి బాధ్యతలు, ఆ స్థానాలపై కన్ను
తెలుగు, ఇంగ్లీషు భాషల్లో అనర్గళంగా మాట్లాడే షర్మిల కచ్చితంగా మైనార్టీ, సీమాంధ్ర ప్రజలతో పాటు దళితులు, బిసిలు, రెడ్డి సామాజిక వర్గం ఓటర్లను ఆకట్టుకుంటారనే విశ్వాసంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకునేంత వరకు ఈ ప్రాంతంలో జగన్ పార్టీకి మంచి పునాదులు ఉండేవి.
కాని విభజనను వ్యతిరేకిస్తూ సమన్యాయమని, మళ్లీ సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకోవడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి జనక ప్రసాద్, గట్టు రామచంద్ర రావు, రాఘవ రెడ్డి తదితరులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 119 సీట్లు, 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తోంది.
కనీసం ఆరు శాతం సీట్లు వస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి జాతీయ పార్టీ స్థానం దక్కే అవకాశం ఉంది. 119 నియోజకవర్గాల్లో ప్రచారం అక్కర్లేదు. కాని అభ్యర్థుల కొరత ఉంది. పార్టీ సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే జనాల్లోకి వెళ్లింది. అందుకే 119 సీట్లలో అభ్యర్థులను పోటీకి నిలబెట్టినా, 50 స్థానాల్లో మాత్రం గట్టి అభ్యర్థులను రంగంలోకి దించనున్నారు.
అందులో 25 స్థానాలపై పూర్తి స్థాయిలో పట్టు బిగించి గెలిచేందుకు వ్యూహాలు ఉన్నాయట. ముస్లింలు, దళితులతోపాటు బిసి, రెడ్డి సామాజికవర్గాల్లో దివంగత వైయస్కు చాలామంది అభిమానులు ఇప్పటికీ ఉన్నారు. లోకసభ స్థానాలకు వచ్చేసరికి, మహబూబాబాద్, మల్కాజగిరి, ఖమ్మం, సికింద్రాబాద్, చేవెళ్ల సీట్లపై దృష్టి పెట్టారు.
మల్కాజగిరిలో 80 శాతం సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం సీమాంధ్ర ఓటర్లు ఉన్నారు. మజ్లిస్, సిపిఎం పార్టీతో పొత్తు కలిసి వస్తుందనే ఆశతో ఆ పార్టీ ఉంది. కాని తెరాసతో పొత్తుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.