నవ్వుకుంటున్నారు: బాబుపై తమ్మినేని, సిగ్గుచేటని..
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారులను తెలుగుదేశం కార్యకర్తల మాదిరిగా పనిచేయాలని ఆదేశిస్తూ పరిపాలనను భ్రష్టుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన అనుచరులకు లాభం చేకూర్చే విధంగా జీవోలు జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలను చూసి ఐఎఎస్, ఐపిఎస్లు నవ్వుకుంటున్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు తగినట్లుగా నడుచుకోవాలని హితవు పలికారు.
అపారమైన అనుభవం ఉన్నట్లు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వ విభాగాలు టిడిపికి అనుకూలంగా పనిచేయాలని కోరడం సిగ్గుచేటన్నారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్ధకు విరుద్ధమని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ నేత అయినా రాజకీయాలకు అతీతంగా పనిచేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మాదిరిగా ప్రజానాయకుడిగా వ్యవహరించాలని కోరారు.
ఇది ఇలా ఉండగా ఏలూరు ఎంపి మాగంటి బాబును వెంటనే అరెస్టు చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుకనూరు మండలంలో మాగంటి బాబు తన అనుచరగణంతో వెళ్లి ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. ఈ దాడిని తమ పార్టీ సీరియస్గా తీసుకుంటుందన్నారు.