జగన్కు షాక్: వైఎస్ఆర్ కుటుంబానికి నామమాత్రపు స్పందన, ఒత్తిడిలో వైసీపీ నేతలు
వైఎస్ఆర్ కుటుంబానికి నామమాత్రపు స్పందన రావడంపై వైఎస్ జగన్ అసంతృప్తి.చిత్తూరులో అత్యధికంగా ఈ కార్యక్రమానికి స్పందన రావడంపై జగన్ హర్షం.
అమరావతి: వైఎస్ఆర్ కుటుంబానికి ఆశించిన మేర స్పందన లభించకపోవడంతో ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వైఎస్ఆర్ కుటుంబానికి నామమాత్రపు స్పందన లభించింది.
వైఎస్ఆర్ కుటుంబం పేరుతో ఇటీవల వైఎస్ఆర్సీపీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ను అభిమానించే వారిని ఒకే తాటిమీదికి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ప్రారంంభించింది.
అంతేకాదు రాష్ట్రంలో టిడిపి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు వైఎస్ఆర్ కుటుంబం వారధిగా పనిచేసేలా వైసీపీ ప్లాన్ చేస్తోంది.
అయితే వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించిన సమీక్షలో వైఎస్ఆర్సిపీ అధినేత జగన్ షాక్కు గురయ్యారు. ఈ కార్యక్రమానికి నామమాత్రపు స్పందన రావడం పట్ల ఆయన పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఉత్తర కోస్తాలో వైఎస్ఆర్ కుటుంబానికి నామమాత్రపు స్పందన
వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి ఉత్తరకోస్తా జిల్లాల్లో నామమాత్రపు స్పందన లభిస్తోంది.దీంతో ఈ విషయమై పార్టీ సీనియర్ నేతలతో వైసీపీ అధినేత జగన్ చర్చించారు. వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి విజయనగరం జిల్లాలో 62,927 మాత్రమే నమోదు చేసుకొన్నారు. అయితే విజయనగరం జిల్లాలో 1.9 శాతం మాత్రమే ఈ కార్యక్రమం కింద తమ పేర్లు నమోదు చేసుకొన్నారని వైసీపీ నాయకత్వం గుర్తించింది.
శ్రీకాకుళం జిల్లాల్లో 5 శాతం మాత్రమే
శ్రీకాకుళం జిల్లాలో ఐదుశాతం మందిని వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం కింద ఎంపిక చేసుకొన్నారు.శ్రీకాకుళం జిల్లాలో 1,79,694 మంది, విశాఖ జిల్లాలో 1,67,126 మంది ఈ కార్యక్రమం కింద తమ పేర్లను నమోదు చేసుకొన్నారు.విజయనగరం జిల్లాతో పోలిస్తే ఈ రెండు జిల్లాల్లో కాస్త మెరుగైన ఫలితాలు ఉన్నాయని వైసీపీ భావిస్తోంది.
చిత్తూరులో 8 శాతం, కడపలో 4 శాతమే నమోదు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలో 2,86,959 మంది వైఎస్ఆర్ కటుంబం కింద తమ పేర్లను నమోదుచేసుకొన్నారు. కడప జిల్లాలో మాత్రం 1,46,111 మంది వైఎస్ఆర్ కుటుంబం కింద తమ పేర్లను నమోదుచేసుకొన్నారు. చిత్తూరులో 8.7 శాతం, కడపలో 4.4 శాతంగా నమోదు చేసుకొన్నట్టు ప్రశాంత్కిషోర్ టీమ్ ప్రకటించింది.
తూర్పుగోదావరిలో అత్యధికంగా 9 శాతం నమోదు
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3,27,679 మంది పేర్లు నమోదయ్యాయి. కర్నూల్ జిల్లాలో 1,57,682 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 2,67,495 మంది తమ పేర్లను నమోదుచేసుకొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 9.9 శాతంగా, కర్నూల్ లో 4.4 శాతం, నెల్లూరులో 2,38,528 పేర్లతో 7.2 శాతంగా నమోదు చేసుకొన్నట్టు ప్రశాంత్ కిషోర్ వైసీపీకి ఇచ్చిన లెక్కల ప్రకారం తేలింది.
రాయలసీమలో వైఎస్ఆర్ కుటుంబం నమోదు పట్ల అసంతృప్తి
రాయలసీమలో అతి తక్కువగా వైఎస్ఆర్ కుటుంబ కార్యక్రమంపై పేర్లను నమోదు చేసుకోవడంపై వైసీపీ చీఫ్ జగన్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి పేర్లు నమోదు కావడంపై వైఎస్ జగన్ సంతృప్తిని వ్యక్తం చేశారు.కోటి మందిని ఈ కార్యక్రమం కింద చేర్పించాలని జగన్ భావిస్తున్నారు. కనీసం రెండో విడత కార్యక్రమం పూర్తయ్యేనాటికి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.