దివాకర్ రెడ్డి బస్సు కాబట్టే: టార్గెట్ చేసిన జగన్ పార్టీ నేతలు
జగన్పై జెసి దివాకర్ రెడ్డి గతంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో వైసిపి నేతలు ఆయనను టార్గెట్ చేశారు.
విజయవాడ: దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై పది మంది మృత్యువాత పడిన ఉదంతాన్ని ఆసరా చేసుకుని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జెసి దివాకర్ రెడ్డిని టార్గెట్ చేశారు. బాధితులను పరామర్శించడానికి వెళ్లిన సందర్బంలో జగన్ కలెక్టర్తో గొడవ పెట్టుకోవడాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు వివాదంగా మార్చిన విషయం తెలిసిందే.
ఈ స్థితిలో దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు విరుచుకుపడుతున్నారు. జగన్ను దివాకర్ రెడ్డి పలుమార్లు వివిధ సందర్భాల్లో తిట్టి పోశారు. జగన్పై తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ స్థితిలో దివాకర్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో వారు ఉన్నట్లు కనిపిస్తున్నారు.
బస్సు ప్రమాదంతో దివాకర్ రెడ్డి దాదాపుగా ఆత్మరక్షణలో పడినట్లేనని చెప్పవచ్చు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా ఇది వరకే జగన్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. అంబటి రాంబాబుతో పాటు పలువురు నాయకులు ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ట్రావెల్స్ యాజమాన్యాన్ని కాపాడుతున్నారు....
దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కాపాడుతున్నారని వైసిపి నేత అంబటి రాంబాబు విమర్శించారు. అందుకే శవరాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. దివాకర్ రెడ్డి బస్సు కాబట్టే డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయలేదని ఆయన తప్పు పట్టారు. వాస్తవాలు వెలుగు చూస్తాయనే భయంతోనే అలా చేశారని అన్నారు. దివాకర్ ట్రావెల్స్పై కాకుండా తమ పార్టీ నేత జగన్పై కేసు పెట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. తమ పార్టీ నేతలపై కేసులు పెట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని అన్నారు.
ఆ ట్రావెల్స్ను తెలంగాణలో నిషేధించాలి...
తెలంగాణలో దివాకర్ ట్రావెల్స్ను పూర్తి స్థాయిలో నిషేధించాలని, ప్రమాదానికి కారణమైన ట్రావెల్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టి యజమానులను అరెస్టు చేయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి డిమాడం్ ేసారు. బస్సు ప్రమాదంలో మరణించిన సోదరులు డాక్టర్ శేఖర్ రెడ్డి, కృష్ణా రెడ్డిల మృతదేహాలను సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండంల కోదండరాంపురంలో బుదవారం ఆయన సందర్శించి, నివాళులు అర్పించారు. యజమాని నిర్లక్ష్యం, డ్రైవర్ అజాగ్రత్తవల్లనే ప్రమాదం జరిగిందని అన్నారు. పరామర్శకు వెళ్లిన తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని టిడిపి ప్రభుత్వం అడ్డుకోవడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు. జగన్ పట్ల అధికారులు వ్య.వహరించిన తీరు బాదాకరమని అన్నారు.
దోషులను తప్పించే కుట్ర జరుగుతోంది....
దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దోషులను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని వైయస్సార్ కాంగ్రెసు పా్రీ పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విమర్శించారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్పై కేసులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు. అన్యాయం జరుగుతున్నప్పుడు బాధితుల పక్షాన నించోవడం తప్పా అని ఆయన అడిగారు. ఇలాంటి కేసులకు భయపడే ప్రసక్తి లేదని అన్నారు. నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు.
తరలింపులో అంత తొందర ఎందుకు...
బస్సు ప్రమాదంలో మరణించినవారి శవాలను ఇళ్లకు తరలించడంలో ప్రభుత్వం చాలా చురుగ్గా వ్యవహరించిందని, అంత తొందరగా శవాలను తరలించాల్సిన అవసరం ఏముందని వైసిపి నేత పార్థసారథి అన్నారు. బస్సు ప్రమాదంపై మాట్లాడకుండా జగన్ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకపోతే ప్రమాదానికి కారణాలు ఎలా తెలుస్తాయని మాత్రమే జగన్ అడిగారని ఆయన చెప్పారు. రాజకీయ కుట్రలో భాగంగానే అధికారులను టిడిపి ప్రభుత్వం పావుల్లా వాడుకుంటోందని అన్నారు.
ఇలా చేస్తారా అని రోజా ప్రశ్న...
ఏ రాష్ట్రంలోనైనా.. ఓ ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరించిన దాఖలాలు ఉన్నాయా? అని జగన్ పట్ల కలెక్టర్ వ్యవహరించిన తీరుపై వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. జగన్ మాట్లాడిన ఒక్క మాటనే పదేపదే చూపించి.. బస్సు ప్రమాదంలో మరణించిన పదకొండు వారి ఆత్మలకు శాంతి లేకుండా చేయవద్దని సూచించారు. 11మంది ప్రాణాలు పోవడానికి కారణమైన జేసీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని టీడీపీ ప్రభుత్వ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని రోజా నిలదీశారు. ఘటనపై సరైన దర్యాప్తు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ప్రతీ విషయంలోను నోరు పారేసుకునే దేవినేని ఉమా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి కామినేని ఘటనాస్థలికి కూడా రాకుండా మీడియా ముందు ఏవో రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోయారని రోజా మండిపడ్డారు.