నేడు వైయస్ ఆరో వర్ధంతి: నివాళులర్పించిన జగన్, కుటుంబ సభ్యులు
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతిని పురస్కరించుకుని వైయస్సార్ ఘాట్ వద్ద ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద శ్రద్ధాంజలి ఘటించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళ్లారు.
వైయస్ జగన్ బుధవారం ఉదయం తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతిలతో కలిసి తన సొంత ఎస్టేట్ ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్దకు చేరుకున్న జగన్, తన తండ్రికి ఘన నివాళి అర్పించారు. అనంతరం ప్రార్థనలు చేశారు. ఈరోజు రాత్రి అక్కడి నుంచి బయలుదేరి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి గురువారం ఉదయానికి హైదరాబాద్కు చేరుకుంటారు.
మరోవైపు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరో వర్ధంతి వేడుకలు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. అనంతరం పంజాగుట్టలోని వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నివాళులర్పించారు.
ఉమ్మడి రాష్ట్రానికి వరుసగా రెండో సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబర్ 2న కర్నూలు జిల్లా ఆత్మకూరు సమీపంలోని నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. వైయస్ ఆరో వర్ధంతి సందర్భంగా ఆయనకు వైసీపీ నేతలు, కార్యకర్తలు రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.
వైయస్ లేని లోటు రెండు రాష్ట్రాల్లో కనిపిస్తోంది: ఉమ్మారెడ్డి
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి లేని లోటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చిన ఘనత వైయస్దేనని అన్నారు.
పేద ప్రజలకు మేలు చేసేలా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబంలో సభ్యుడిగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. అసెంబ్లీలో తొలగించిన వైయస్ చిత్రపటాన్ని తిరిగి యాథాస్థానంలో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.