రైతాంగం బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్, పంటలకు మద్ధతు ధర ఇచ్చింది జగన్ సర్కారే: మంత్రి బొత్స
స్వాతంత్ర్య భారతదేశంలో.. ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత జరిగిన పరిణామాలన్నింటినీ హై పవర్ కమిటీ చర్చిస్తోందని కమిటీ సభ్యులు, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రాంతీయ అసమానతలు తొలగించేందుకు ఎలాంటి విధానాలు అవలంభించాలనే అంశంపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఆయా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. హై పవర్ కమిటీ అధ్యయనం చేసిన వివరాలను సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించామన్నారు.
రైతులకు మేలే..
అమరావతి రాజధాని కోసం భూములిచ్చినా రైతుల గురించి కూడా సమావేశంలో ప్రధానంగా చర్చించామని బొత్స సత్యనారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కన్నా మెరుగైన నిర్ణయం తీసుకుంటామని, రైతులకు ప్రయోజనం కలిగించేలా డెసిషన్ ఉంటుందని ఇండికేషన్ ఇచ్చారు. అన్నదాతలకు ప్రయోజనం కలిగించేలా నిర్ణయాలు ఉంటాయన్నారు.
బ్రాండ్ అంబాసిడర్
రైతాంగం అంటే బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్ అని గుర్తుచేశారు. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదని, దేశవ్యాప్తంగా రైతుల కోసం పాటుపడే నేత ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని చెబుతారు. ఆయన కుమారుడు, ప్రస్తుత సీఎం జగన్ రైతుల బాగు కోసం నిర్ణయాలు తీసుకుంటారని చెప్పారు. పంటకు మద్దతు ధర అందజేస్తున్నది ఏపీయేనని స్పష్టంచేశారు.
సీఆర్డీఏ రద్దా..? తెలియదే..?
సీఆర్డీఏ చట్టం రద్దు చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. అలాంటి చర్చ రాలేదని, మీకెవరు చెప్పారని తనదైనశైలిలో బొత్స సమాధానం ఇచ్చారు. రైతుల సలహాలకు సంబంధించిన ఈ-మెయిల్ పనిచేయడం లేదని అంటే.. తాను కమిషనర్తో మాట్లాడానని.. కావాలని కొన్ని మీడియా సంస్థలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని గుర్తుచేశారు. రైతులతో నేరుగా మాట్లాడటం లేదని మరో ప్రతినిధి అడిగితే.. తన వద్దకొచ్చి కొందరు తమ గోడు చెప్పుకున్నారని.. మాట్లాడకపోవడం అంటూ ఏమీ ఉండదని చెప్పారు.
తుది మెరుగులు
శనివారం మరోసారి హై పవర్ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో తుది నివేదిక రూపకల్ప చేసి..19వ తేదీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసే అవకాశం ఉంది. 20వ తేదీన అసెంబ్లీలో కమిటీ నివేదికలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. 21వ తేదీన మండలిలో ఆమోదం తెలిపి.. ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉంది.