వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా: నేటినుండి వారికి లక్షరూపాయలు; ఆడబిడ్డలకు సీఎం జగన్ కానుక!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది. ఆడపిల్లలకు పెళ్లి కానుక గా ఆర్థిక సహాయం చెయ్యాలని నిర్ణయించిన జగన్ సర్కార్ వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా పథకాలను నేటి నుండి అమలులోకి తీసుకు వస్తోంది. వీటికి సంబంధించిన వెబ్ సైట్ లను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సెప్టెంబర్ 30వ తేదీన లాంఛనంగా ప్రారంభించగా నేటి నుండి ఈ పథకాలు అమలులోకి రానున్నట్టు వెల్లడించారు.
వైఎస్సార్ కళ్యాణమస్తు .. షాదీ ముబారక్ .. నిబంధనలు ఇవే
బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు, కార్మికుల కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. వైయస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల దరఖాస్తు చేసుకునే వధూవరులకు సంబంధించిన నిబంధనల విషయానికి వస్తే వారికి పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. వివాహ తేదీకి వధువు వయసు 18 సంవత్సరాలు, వరుడు వయసు 21 సంవత్సరాలు కచ్చితంగా నిండి ఉండాలని ప్రభుత్వ నిబంధనలలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువులు ప్రోత్సహించే ఉద్దేశంతోనే పదవ తరగతి పాస్ నిబంధనలు అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా వారికి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు లక్ష రూపాయల ఆర్ధిక సాయం
నేటి నుంచి అమల్లోకి రానున్న ఈ పథకంలో ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సహాయం అందించి, ప్రభుత్వం చేయూతనివ్వనుంది. వైయస్ఆర్ కల్యాణమస్తు లో భాగంగా ఎస్సిలకు లక్ష రూపాయలు, ఎస్సీల కులాంతర వివాహాలకు లక్షా ఇరవై వేల రూపాయలు, ఎస్టీలకు లక్ష రూపాయలు, ఎస్టీల కులాంతర వివాహాలకు లక్షా 20 వేల రూపాయలు, బీసీలకు 50 వేల రూపాయలు, బీసీల కులాంతర వివాహాలకు 75 వేల రూపాయలు ఇవ్వనున్నారు.
ఇక వైయస్సార్ షాదీ తోఫా కింద ముస్లిం మైనార్టీలకు లక్ష రూపాయలు, దివ్యాంగుల వివాహాలకు లక్షా 50 వేల రూపాయలు ఇవ్వనున్నారు. ఇక భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఆడపిల్లల వివాహాలకు 40 వేల రూపాయలు ఆర్థిక సహాయంగా పెళ్లి కానుకగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
పిల్లల చదువుల ప్రోత్సాహం.. బాల్య వివాహాలను నివారించటం వంటి లక్ష్యాలతో కళ్యాణమస్తు
వైయస్సార్ కళ్యాణమస్తు, వైయస్సార్ షాదీ తోఫా వెబ్ సైట్లను ప్రారంభించిన వైయస్ జగన్ నిరుపేద కుటుంబాల లో ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించడమే కాకుండా, పిల్లల చదువులు ప్రోత్సహించడానికి, బాల్యవివాహాలను నివారించడానికి, పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడానికి, చదువుల డ్రాప్ అవుట్ రేటును తగ్గించడానికి వైయస్సార్ కల్యాణమస్తు, షాది తోఫా పథకాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు.
ఇక నేటి నుండి ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులో ఉండటంతో ప్రభుత్వం సూచించిన నిబంధనల మేరకు ఆడపిల్లల వివాహం కోసం తల్లిదండ్రులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.