నాడు వైఎస్ ది హుందాతనం...నేడు సిఎం ది వెకిలితనం:తిరుపతిలో ఆనాటి పోస్టర్ తో వైసిపి ధర్నా
తిరుపతి:వైసిపి అధినేత జగన్ పై హత్యాయత్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందనపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. జగన్ పై దాడి విషయంలో చంద్రబాబు ప్రవర్తన చాలా చౌకబారుగా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టిడిపి నేతల విమర్శల స్పందించిన వైసిపి నేతలు తిరుపతిలో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా నాడు అలిపిరిలో చంద్రబాబుపై నక్సలైట్ల దాడిని ఖండిస్తూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన నిరసన ప్రదర్శన ఫోటోను ప్రదర్శిస్తూ వైసిపి నేతలు బైఠాయింపు జరిపారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పందనకు...నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్షన్ కు తేడాను ప్రజలు అర్థం చేసుకోవాలనే ఇలా ప్రదర్శన నిర్వహించానట్లు వైసిపి నేతలు ఈ సందర్భంగా చెప్పారు.
తేడా... మీరే గమనించండి
ప్రతిపక్ష నేతపై దాడి సందర్భంగా స్పందించిన తీరులో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, సీఎం చంద్రబాబుకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో ప్రజలు గుర్తించాలని కోరుతున్నారు తిరుపతి వైసిపి నేతలు. ఈ తేడాను ప్రజలు గమనించాలని...వైఎస్ఆర్ ఔన్నత్యాన్ని చాటేందుకే నాటి దీక్ష ఫొటోతో ప్రదర్శన నిర్వహిస్తున్నామని చెప్పారు.
అందుకే...ఈ ప్రదర్శన
అప్పటి సిఎం చంద్రబాబుపై నక్సల్స్ దాడికి ప్రతిస్పందనగా అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తిరుపతిలో దీక్షకు దిగారని...ఆ ఫోటోను ఫ్లెక్సీ గా వేయించి నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నామని...స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఎస్కే బాబు, కోటూరు ఆంజినేయులు, నల్లాని బాబు, తాళ్లూరి ప్రసాద్, అమర్నాథరెడ్డి తదితరులు తెలిపారు.
ఆనాటి...మౌన దీక్ష
ఈ సందర్భంగా వైసిపి నేతలు మాట్లాడుతూ 2003లో అప్పటి సీఎం చంద్రబాబుపై అలిపిరిలో దాడి సందర్భంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి నక్సల్స్ చర్యను తీవ్రంగా ఖండించడమే కాకుండా తిరుపతిలో మౌనదీక్ష చేసి హుందాతనాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు.
చంద్రబాబు...దూషణలు
అయితే ఇప్పటి ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించడం కూడా చేయకుండా...సీఎం చంద్రబాబు మీడియా సమావేశంలో వెకిలిగా నవ్వుతూ అభ్యంతరకర భాషతో మాట్లాడారని...ప్రతిపక్ష నేతపై ఏకవచనంతో దూషణలకు దిగారని వైసిపి నేతలు దుయ్యబట్టారు.