ఏపీలో మరో సంక్షేమ పథకం వాయిదా: కొత్త తేదీని ప్రకటించిన ప్రభుత్వం
అమరావతి: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకం ప్రారంభ కార్యక్రమం వాయిదా పడింది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా ఈ పథకాన్ని వాయిదా వేసింది ప్రభుత్వం. కొత్త తేదీని ప్రకటించింది. మంగళవారం ప్రారంభించాలని షెడ్యూల్ చేసిన వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకాన్ని ఈ నెల 7వ తేదీన ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు కావడం వల్ల పేదలందరికీ ఇళ్లు పథకం వాయిదాలు పడుతూ వస్తోన్న విషయం తెలిసిందే.
Recommended Video
రాష్ట్రంలో మాతాశిశు మరణాలను తగ్గించడంలో భాగంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీని కింద గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 1600 కోట్ల రూపాయల మేర నిధులను కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికహారాన్ని అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. రక్తహీనత వల్ల మాతాశిశు మరణాలు నమోదవుతున్నాయని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నివారించడానికి ఈ పథకాన్ని ప్రకటించింది.
అర్హులైన వారికి ఈ పథకం కింద పౌష్టికాహారాన్ని అందిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే 30 లక్షలమందికి పైగా ఈ పథకానికి అర్హులుగా గుర్తించింది. వారంతా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అర్హుల జాబితాను ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచింది. మంగళవారం ఈ పథకం ప్రారంభం కావాల్సి ఉంది. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూయడంతో ఈ పథకాన్ని వాయిదా వేసింది. కేంద్ర ప్రభుత్వం ఏడురోజుల పాటు సంతాప దినాలను ప్రకటించడంతో ఈ పథకాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 7వ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.