వైఎస్ విగ్రహం ధ్వంసం: తొలగింపుపై అంబటి ఫైర్
అనంతపురం/ హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని కనగనపల్లి మండలం తగరకుంటలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. తెలుగుదేశం పార్టీ వర్గీయులే వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేసుంటారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుంటే, విగ్రహాలను తొలగించాలనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఆదేశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతోనే వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను తొలగించినా, తరలించినా తమ పార్టీ కార్యకర్తలు, వైయస్ అభిమానులు చూస్తూ ఊరుకోరని ఆయన శనివారం హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు.
చంద్రబాబు నాయుడు దురుద్దేశంతో వ్యవహరిస్తే ప్రతిఘటిస్తామని ఆయన అన్నారు. దురుద్దేశంతో వైయస్ విగ్రహాన్ని తాకితే ఏ శక్తి ఉందో తెలుస్తుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ను విగ్రహంగా మార్చింది చంద్రబాబు కాదా అని ఆయన అడిగారు. తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీకీ మద్దతు ఇవ్వడం లేదని ఆయన స్పష్టం చేశారు.
టిడిపి అభ్యర్థి సుగుణమ్మకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. మానవతా దృక్పథంతోనే తమ పార్టీ తిరుపతిలో పోటీ చేయడం లేదని ఆయన అన్నారు.