పెకిలించిన చోటే పునఃప్రతిష్ఠ: స్థలాన్ని పరిశీలించిన మంత్రులు
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విజయవాడలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఇదివరకు ఉన్న వైఎస్ విగ్రహాన్ని చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తొలగించారు. విజయవాడలో కృష్ణా పుష్కరాల సందర్భంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందనే కారణాన్ని చూపించి, ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించారు. తాజాగా- ప్రభుత్వం మారిన నేపథ్యంలో.. వైఎస్ విగ్రహాన్ని అదే స్థానంలో పునఃప్రతిష్ఠించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్టు, జోగి రమేష్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తదితరులు బందరు రోడ్డులోని పోలీస్ కంట్రోల్ రూమ్తో పాటు పలు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం- వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్లోనే పునఃప్రతిష్టించాలని నిర్ణయించారు. ఈ స్థల పరిశీలన అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు నగరపాలక సంస్థ కార్యాలయంలో భేటీ అయ్యారు.
ఇదివరకు జలయజ్ఞం స్ఫూర్తిని ప్రతిబింబించేలా పులిచింతల ప్రాజెక్టు నమూనాతో ఇదే జంక్షన్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చెందిన 12 అడుగుల క్యాంస విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ నగరపాలక సంస్థ పాలక మండలి 2010 ఏప్రిల్లో ఓ తీర్మానం చేసింది. విగ్రహాన్ని నెలకొల్పడానికి అప్పట్లో ఆర్ అండ్ బీ, పోలీసు శాఖ అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా 2011 సెప్టెంబర్ 2న ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. ఏర్పాటు చేశారు. దీనికి వైఎస్సార్ చౌక్ అనే పేరును మున్సిపల్ కార్పొరేషన్ ఖరారు చేసింది.
చంద్రబాబు హయాంలో 2016 జూలై 31 రాత్రి ఈ విగ్రహాన్ని తొలగించారు. కృష్ణా పుష్కరాలకు విచ్చేసే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందనే కారణంతో దీన్ని రాత్రికి రాత్రి తీసేయించారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహవించారు. అయినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ విగ్రహాన్ని, అక్కడ కట్టిన పులిచింతల ప్రాజెక్టు నమూనాను పెకిలించి వేశారు. విగ్రహాన్ని సమీపంలోనే ఉన్న అగ్నిమాపక దళ కార్యాలయంలో ఉంచారు. ప్రస్తుతం అదే విగ్రహానికి తుది రూపాన్ని ఇచ్చి, మళ్లీ కంట్రోల్ రూమ్ జంక్షన్లోనే నెలకొల్పనున్నారు.