హామీ ఇచ్చిన చోటే.. అమలు: వాహనమిత్ర పథకానికి శ్రీకారం..ఖాకీ చొక్కాతో!
ఏలూరు: రాష్ట్రంలో మరో సంక్షేమ పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 73 వేల మందికి పైగా డ్రైవర్లకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే పథకం అది. అదే- వైఎస్సార్ వాహనమిత్ర. ఆటో, క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని కల్పించడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని వైఎస్ జగన్ శుక్రవారం ఏలూరులో ప్రారంభించారు. ఏలూరులోనే ఎందుకు ప్రారంభించారనడానికి ఓ కారణం ఉంది. ప్రతిపక్ష నేతగా పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్.. ఈ హామీని ఇచ్చింది ఏలూరులోనే. పాదయాత్రలో భాగంగా ఏలూరుకు వచ్చిన ఆయనను పెద్ద సంఖ్యలో డ్రైవర్లు కలుసుకున్న సమయంలో ఈ హామీని ఇచ్చారాయన.
మరో సంక్షేమ పథకానికి శ్రీకారం: రేపటినుంచే వైఎస్సార్ వాహనమిత్ర: భారీగా దరఖాస్తులు
అత్యధికులు ఆటో డ్రైవర్లే..
వైఎస్సాఆర్ వాహనమిత్ర పథకం కింద లబ్దిపొందే వారిలో అత్యధికులు ఆటో డ్రైవర్లే ఉన్నారు. మొత్తం 1,56,804 మంది ఆటో డ్రైవర్లు ఈ పథకం కింద ఏటా 10 వేల రూపాయలను పొందడానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన వారిలో ట్యాక్సీ క్యాబ్ - 11,205, మ్యాక్సీ క్యాబ్ - 5,093 డ్రైవర్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం వారి పేరు మీద తెరిచిన బ్యాంకు ఖాతాల్లో 10 వేల రూపాయలను జమ చేస్తుంది ప్రభుత్వం. దీనికి ఖర్చు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం ఇదివరకే బడ్జెట్ లో కేటాయించింది. అర్హులైన వారిని గుర్తించిన తరువాత.. దరఖాస్తులకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని వెల్లడించింది.
తిరస్కరణకు గురైన దరఖాస్తులు.. 2,250
కిందటి నెల 10వ తేదీ నుంచి నిర్దేశిత గడువులో రవాణా శాఖ అధికారులకు అందిన మొత్తం దరఖాస్తుల సంఖ్య 1,75,352. దీన్ని వడపోసిన తరువాత 1,73,102 దరఖాస్తులు వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద లబ్ది పొందడానికి అర్హమైనవిగా గుర్తించారు. 2,250 దరఖాస్తులను తిరస్కరించారు. తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో అత్యధికంగా యజమాని పేరు మీద ఉన్నవే కావడం గమనార్హం. ఆటో, క్యాబ్ లేదా ట్యాక్సీ ఉండి సొంతంగా నడిపుకుని జీవనాన్ని గడిపే డ్రైవర్లకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయడం వల్ల అవి తిరస్కరణకు గురైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలవారీగా ఆమోదం పొందిన దరఖాస్తులు
శ్రీకాకుళం-10,652, విజయనగరం-10,922, విశాఖపట్నం-24,512, తూర్పు గోదావరి-19,209, పశ్చిమ గోదావరి-13,074, కృష్ణా-20,333, గుంటూరు-13,992, ప్రకాశం-8565, నెల్లూరు-13,697, చిత్తూరు-12,160, కడప-8536, అనంతపురం-7486, కర్నూలు-9964.
ఖాకీ చొక్కాతో వైఎస్ జగన్
ఈ పథకం ప్రారంభం సందర్భంగా వైఎస్ జగన్ ఖాకీ చొక్కాతో కనిపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తానని పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చానని, దాన్ని అమలు చేస్తున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అమలు చేశామని చెప్పారు. పాదయాత్ర సందర్భంగా ఆటో డ్రైవర్ల ఇబ్బందులను తాను చూశానని, వాటిని అధిగమించడానికి వైఎస్సార్ వాహన పథకాన్ని రూపొందించామని అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడకుండా అర్హత ఉన్న ప్రతి డ్రైవర్ కూ ఈ పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు.